మొయినాబాద్, జనవరి 8 : మిట్ట మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో.. ఓ యువతి మృతదేహాన్ని దుండగులు పెట్రోలు పోసి తగలబెట్టారు. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడుతుండటంతో అనుమానం వచ్చిన చుట్టు పక్కల పొలాల్లోని రైతులు.. అక్కడికెళ్లి చూడగా.. మంటల్లో శరీరం కాలుతున్నట్లు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనాస్థలికి వచ్చే సరికి 90 శాతానికి పైగా గుర్తించలేని స్థితిలో ఉన్నది.
పోలీసుల ప్రాథమిక దర్యాఫ్తులో ఆ యువతి బ్లూ కలర్ జీన్స్ పాయింట్ వేసుకున్నట్లుగా తేలడంతో కాలేజీ విద్యార్థిని అయి ఉండొచ్చా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొయినాబాద్ సమీపంలోని డ్రీమ్ వ్యాలీ సమీపంలో సోమవారం పట్టపగలు జరిగిన ఈ దారుణ ఘటన సంచలనం రేకెత్తిస్తున్నది. పోలీసుల కథనం ప్రకారం.. గుర్తు తెలియని ఓ యువతి(25)ని దుండగులు ఎక్కడో దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని బాకారం రెవెన్యూలోని డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ సమీపంలోని రోడ్డు పక్కన పడేశారు.
ఆమె ఆనవాళ్లు తెలియకుండా ఉండేందుకు పెట్రోల్ పోసి తగలబెట్టారు. బాకారం గ్రామస్తులు గమనించి పోలీసులకు సమాచారమందించారు. ఘటనా స్థలాన్ని రాజేంద్రనగర్ అదనపు డీసీపీ రష్మీ పరిమల్, చేవెళ్ల ఏసీపీ ప్రశాంత్రెడ్డి సందర్శించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖాన మార్చురీకి తరలించారు.
దుండగులను గుర్తించేందుకు పోలీసులు క్లూస్టీం, డాగ్ స్కాడ్ , ఎస్బీ బృందాలను రంగంలోకి దించారు. క్లూస్ టీం బృందం మృతదేహం వెంట్రుకలు, సగం కాలిన సెల్ఫోన్ను సేకరించింది. మృతదేహాన్ని తీసుకొచ్చిన దారిలో పోలీస్ జాగిలాలు కొంత దూరం వెళ్లి తిరిగివచ్చాయి. యువతిని హత్య చేసిన వారిని త్వరలోనే పట్టుకుంటామని.. హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మొయినాబాద్ పోలీసులు తెలిపారు.