కందుకూరు, జూలై 26: నాడు పల్లెలంటే సమస్యల సుడిగుండాలు. కానీ సీఎం కేసీఆర్ ప్రారంభించిన పల్లె ప్రగతి కార్యక్రమాలతో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. పచ్చందాలతో ప్రకృతి వనాలు, అంతియ యాత్రలో ఇక్కట్లు లేకుండా వైకుంఠధామాలు, చెత్త సమస్యకు పరిష్కారం, డంపింగ్ యార్డుల నిర్మాణం, ప్రతి పంచాయతీలో నర్సరీల ఏర్పాటు , 5 వేల ఎక్టార్లకు ఒక రైతు వేదికల నిర్మాణాలు ఇంకా అనేక రకాల అభివద్ధికి చిరునామాలుగా నేడు గ్రామాలు నిలుస్తున్నాయి. ఇందంతా కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టిన ‘పల్లె ప్రగతి’తోనే సాధ్యమైంది. ప్రభుత్వ సంకాల్పానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, పూర్తి స్థాయిలో సహకరించడంతో అభివృద్ధికి సాధ్యమవుతుంది. కందుకూరు మండల పరిధిలోని 35 గ్రామ పంచాయతీల్లో గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం సాకారం చేస్తున్నది.
పారిశుద్ధ్యం, పచ్చదనంతో పరుగులు పెట్టించడానికి తెలంగాణ ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. పల్లె ప్రగతి కార్యక్రమాలు చేపట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి నెల నిధులను మంజూరు కావడంతో సర్పంచ్లు అభివృద్ధి విషయంలో గ్రామాలను పరుగులు పెట్టిస్తున్నారు. ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాల్లో వాకింగ్ టాక్లు, పచ్చందాన్ని ఆస్వాదిస్తూ సేద తీర్చడానికి బెంచీలు, రోడ్డుకు ఇరువైపుల మొక్కలను నాటుతున్నారు. మొక్కల పరిరణకు ట్రీ గార్డులు ఏర్పాటు చేయడంతో మొక్కలకు ప్రతి రోజు నాటిని అందిస్తున్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ వంటి వాటికి ప్రాధాన్యతను ఇస్తున్నారు. ప్రతి పల్లెల్లో జరుగుతున్న అభివృద్ధి పనులతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామస్తుల మద్దతు, అధికారుల సహకారంతో పల్లె ప్రగతిలో భాగంగా పలు అభివృద్ధి పనులు చేపడుతున్నాం. ప్రభుత్వం ఇచ్చిన నిధులతో గ్రామాన్ని పరిశుభ్రతతోపాటు పచ్చదనంలో ముందంజలో ఉంచాం. పల్లె ప్రగతిలో చేపట్టిన పనులను పరిశీలించడానికి అధికారులు పలుమార్లు సందర్శించారు. వారిచ్చిన సూచనలు, సలహాల మేరకు అభివృద్ధి పనులు చేపడుతున్నాం.
– శ్రీలత శ్రీహరి, సర్పంచ్ గూడూరు
పల్లె ప్రగతి పథకం వల్ల మా గ్రామం రూపరేఖలు మారాయి. ప్రతి కాలనీలో పంచాయతీ సిబ్బంది పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ట్రాక్టరు ద్వారా ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరిస్తున్నాం. పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, డంపింగ్ యార్డు నిర్మాణాల వల్ల గ్రామానికి మంచి గుర్తింపు వచ్చింది. పాలకవర్గం సభ్యులతో కలిసి గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాం.
– బైరు సదాలక్ష్మీ పుల్లారెడ్డి, సర్పంచ్ జైత్వారం