అబిడ్స్, జనవరి 2 : నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ప్రారంభమైన అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్)కు రెండవ రోజు సందర్శకులు తరలివచ్చారు. మైదానంలో స్టాళ్ల నిర్మాణ పనులను పూర్తి చేసి సందర్శకులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 50 శాతం స్టాళ్ల నిర్మాణ పనులు పూర్తి కాగా మిగిలిన పనులను మూడు రోజులలో పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను నిర్వహిస్తారు. పారిశ్రామిక ప్రదర్శనకుగాను దాదాపు 2500 స్టాళ్ల ఏర్పాటుకు ప్రతి సంవత్సరం కేటాయింపులు చేస్తారు. కొవిడ్ నేపథ్యంలో గత సంవత్సరం నుమాయిష్ నిర్వహించకపోగా ఈ సంవత్సరం 1500 స్టాళ్లను మాత్రమే ఏర్పాటు చేశారు. క్షణాలలో ఎగ్జిబిషన్ను చుట్టు ముట్టి వచ్చేందుకు మినీ ట్రైన్ను ప్రారంభించారు. అదే విధంగా అమ్యూజ్మెంట్ పార్క్లో రైడ్స్లలో సందర్శకులు సందడి చేశారు. ఎగ్జిబిషన్ సందర్శకుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపడంతో పాటు మెట్రో రైలు వేళలను పొడిగించాలని ఎగ్జిబిషన్ సొసైటీ కోరింది. 2019 సంవత్సరంలో జరిగిన అగ్నిప్రమాదం దృష్ట్యా అగ్నిమాపక శాఖ ఆదేశాల మేరకు పకడ్బందీ రక్షణ చర్యలు చేపట్టారు. రెండు ట్యాంకులలో నీటిని అందుబాటులో ఉంచారు. అదే విధంగా విద్యుత్ సమస్య తలెత్తకుండా ప్రతి స్టాళ్లకు ఓ ఎంసీబీని ఏర్పాటు చేశారు.
పకడ్బందీగా బందోబస్తు….
నుమాయిష్లో పకడ్బందీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. మెటల్ డిటెక్టర్లు, సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు పోలీస్ శాఖ ద్వారా బందోబస్తు ఏర్పాటు చేశారు. సందర్శకులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరమే మైదానంలోనికి అనుమతిస్తున్నారు. సెక్యూరిటీతోపాటు వలంటీర్లు కూడా మైదానంలో కలియ తిరుగుతూ భద్రతాచర్యలు చేపడుతున్నారు.
థర్మల్ స్క్రీనింగ్…
నుమాయిష్ సందర్శనకు వచ్చే వారికి థర్మల్ స్క్రీనింగ్ చేసిన అనంతరం మాస్క్ ఉంటేనే లోనికి అనుమతిస్తున్నారు. శానిటైజర్లను అందుబాటులో ఉంచారు. ప్రతి నిత్యం సాయంత్రం వేళలో వ్యాక్సిన్, కరోనా యాంటిజెన్ పరీక్షలు నిర్వహించేందుకు గాను కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సొసైటీ అధికారులను కోరింది.
ఎగ్జిబిషన్ నిర్వహణ ద్వారా వస్తున్న ఆదాయంతో ఎగ్జిబిషన్ సొసైటీ తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో విద్యావ్యాప్తికి కృషి చేస్తోంది. ముఖ్యంగా మ హిళామహిళా విద్యావ్యాప్తికిగాను మహిళల కళాశాలలు, పాలిటెక్నిక్, ఫార్మసీ, ఇంజినీరింగ్, డిగ్రీ, ఐటీఐ కళాశాలలను స్థాపించి విద్యావ్యాప్తికి పాటు పడుతోం ది. ఎగ్జిబిషన్ ఆధ్వర్యంలో 18 విద్యా సంస్థలు కొనసాగుతున్నాయి.