శంషాబాద్ రూరల్, మార్చి 3 : ప్లాటుకు రిజిస్ట్రేషన్ చేయిస్తానని చెప్పి రూ.80 లక్షలతో పారిపోయిన నిందితుడిని శంషాబాద్ ఆర్జీఐఏ, రాచకొండ, రాజేంద్రనగర్ ఎస్వోటీ, సీసీఎస్ శంషాబాద్, ఓఆర్ఆర్ సిబ్బంది సహాయంతో 24 గంటల్లో పట్టుకున్నారు. శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్స్టేషన్ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. షేక్పేట్ ఓయూకాలనీ చెందిన విజయ్కుమార్, శ్రీధర్లు సంతోష్కుమార్ మధ్యవర్తిగా మహారాష్ట్రకు చెందిన కొక్కుల రవి అనే రియల్ఎస్టేట్ వ్యాపారి ద్వారా అదే కాలనీలో ఓ ప్లాటు కోనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకున్నారు. ఇందుకుగాను రూ.20 లక్షల చెక్కును రియల్ ఎస్టేట్ వ్యాపారి రవికి గత డిసెంబర్ నెలలో అడ్వాన్స్గా అందజేశారు. రిజిస్ట్రేషన్ నిమిత్తం బాధితులు రవికి ఫోన్ చేయగా మార్చి 2వ తేదీన ప్లాటు ఓనర్ విమానంలో వస్తాడని, మిగతా రూ.80 లక్షలు డబ్బులు తీసుకొని ఎయిర్ పోర్టుకు రావాలని తెలిపాడు. మార్చి 2వ తేదీన విజయ్కుమార్, శ్రీధర్, సంతోష్కుమార్లు డబ్బులతో ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ ఉన్న రవి మూసాపేట రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ఉన్నదని చెప్పి ముగ్గురిని తన కారులో ఎక్కించుకున్నాడు. ఎయిర్పోర్టు నుంచి శంషాబాద్ వస్తున్న క్రమంలో రోడ్డు పక్కన టీ తాగుతామని కారు ఆపాడు. విజయ్కుమార్, శ్రీధర్, సంతోష్కుమార్ టీ తాగుతుండగా రవి రూ.80 లక్షలతో హుడాయించాడు. మోసపోయామని గ్రహించిన బాధితులు వెంటనే ఆర్జీఐఏ పోలీస్స్టేషన్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని ఘట్కేసర్ టోల్ప్లాజా వద్ద అదుపులోకి తీసుకున్నారు. రూ.80 లక్షలు, కారును స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉన్నది.