సిటీబ్యూరో, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ గ్రేటర్ జోన్లో గత నెల కొత్తగా ప్రవేశపెట్టిన 25 విద్యుత్ ఏసీ బస్సులలో వందశాతం వరకు ఆక్యుపెన్సీ రేషియో నమోదవుతుంది. ఈ 25 బస్సులలో 10 బస్సులు పుష్పక్ పేరుతో ఎయిర్పోర్టు వరకు నడిపిస్తున్నారు. మిగిలిన 15 బస్సులు బాచుపల్లి నుంచి వేవ్ర్యాక్, సికింద్రాబాద్ నుంచి వేవ్ర్యాక్ వరకు రెండు మార్గాలలో నడిపిస్తున్న ఆర్టీసీకి మంచి లాభాలే వస్తున్నాయి. నగరంలో ఈ రెండు మార్గాలలో నడుస్తున్న విద్యుత్ ఏసీ బస్సులలో ఐటీ, బ్యాంకు, ఇతర రంగాలకు చెందిన ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ప్రయాణం చేస్తున్నారని అధికారులు చేసిన సర్వే ద్వారా తెలుస్తుంది. ఈ విద్యుత్ బస్సుల గురించి ప్రత్యేక సిబ్బందిని నియమించి జోరుగా ప్రచారం చేస్తున్నారు.
విద్యుత్ ఏసీ బస్సులలో టికెట్ చార్జీలు సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా నిర్ణయించారు. కేవలం రూ.50 నుంచి 60గానే మొదటి స్టాపు నుంచి చివరి స్టాపు వరకు టికెట్ ఛార్జీ నిర్ణయించారు. ఇది మెట్రో ఎక్స్ప్రెస్ చార్జీలతో పోల్చితే రూ.5 మాత్రమే అధికం. అలాగే నగరంలో వివిధ ప్రాంతాల నుంచి అంతర్జాతీయ ఎయిర్పోర్డుకు నడుస్తున్న పుష్పక్ బస్సుల కంటే ఇక్కడ నడుస్తున్న విద్యుత్ బస్సులు చార్జీలు చాలా తక్కువగా నిర్ణయించామని ఆర్టీసీ గ్రేటర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి వెంకటేశ్వర్లు అభిప్రాయపడ్డారు.
ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం ప్రకారం వచ్చే రెండు మూడు నెలల్లో వెయ్యి విద్యుత్ బస్సులు రాబోతున్నాయి. నగరంలో వాయు, శబ్ధకాలుష్యం లేకుండా నగరవాసులకు ఆక్సిజన్ స్థాయి పెంచే క్రమంలో విద్యుత్ బస్సులను నడిపించాలని నిర్ణయం తీసుకున్నారు. వీటిలో 50 బస్సులను మాత్రమే ఏసీగా మార్పు చేసి, మిగిలిన వాటిని నాన్ ఏసీ బస్సులుగా నడిపిస్తారు. టికెట్ చార్జీలు కూడా ఈ బస్సులో తక్కువగా ఉంటాయి. విద్యుత్ బస్సుల కోసం ఒలెక్ట్రా సంస్థతో ఆర్టీసీ యాజమాన్యం ఒప్పందం కుదుర్చుకున్నది.
నగరంలో ఇబ్రహీంపట్నం నుంచి జేబీఎస్ వరకు పది కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తూ మంగళవారం ఆర్టీసీ గ్రేటర్ జోన్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. వీటిలో ఇబ్రహీంపట్నం నుంచి ఐదు బస్సులు, జేబీఎస్ నుంచి ఐదు బస్సులను కేవలం 9 స్టాపులతో ప్రతి 20 నిమిషాలకు ఒక సర్వీసు ప్రయాణికులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. టికెట్ను రూ.60 నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సర్వీసులు ఈ నెల 12 నుంచి రాకపోకలు సాగించనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ జోన్ ఈడీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.