చిక్కడపల్లి, ఆగస్టు11: దేశవ్యాప్తంగా రైతాంగ ఉద్యమానికి 2021లో తలొగ్గిన కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలును విస్మరించినందుకు నిరసనగా రైతులు రెండో దశ రైతాంగ ఉద్యమానికి సిద్ధం కావాలని సయుక్త కిసాన్ మోర్చా జాతీయ నేతలు పిలుపునిచ్చారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం మోర్చా సదస్సు జరిగింది. కనీస మద్దతు ధరల చట్టం, రైతు ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత వంటి హామీల అమలును విస్మరించిన ప్రభుత్వ వైఖరిపై మళ్లీ ప్రజల్లోకి తీసుకెళ్తామని మోర్చా నేతలు తెలిపారు.
ఈ నెల 15న ‘స్వాతంత్య్రాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం’ అన్న నినాదంతో కార్యక్రమాలు చేపడతామని, ఈ నెలాఖరులోగా అన్ని జిల్లా కమిటీల ఏర్పాటు చేసి జిల్లా సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. సెప్టెంబర్, అక్టోబర్లో అన్ని జిల్లాల్లో పాద, వాహన యాత్రలతో ప్రచార ఉద్యమం, నవంబర్ 26, 27, 28 తేదీల్లో వేలాది రైతులతో మూడురోజులపాటు హైదరాబాద్లో మహాధర్నా నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో కిసాన్ మోర్చా జాతీయ కమిటీ ప్రతినిధులు హన్నన్ మొల్లా, రావెల వెంకయ్య, రామిందర్ పాటియాలా, వడ్డే శోభానాద్రీశ్వరరావు, రాయల చంద్రశేఖర్, విస్సా కిరణ్కుమార్, చిట్టిపాటి వెంకటేశ్వరరావు, గిరీష, గాదగోని రవి, ప్రసాద్, నారాయణరావు, వేముపల్లి వెంకటరామయ్య, టీ సాగర్, పశ్య పద్మ తదితరులు హాజరయ్యారు.