ఖైరతాబాద్, డిసెంబర్ 22 : ‘ఉమ్మడి రాష్ట్రంలో ఏ ప్రభు త్వం కూడా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) చైర్మన్ల సమస్యలపై స్పందించలేదు.. అతి తక్కువ వేతనంతో సేవలందించే వాళ్లం..తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత చరిత్రలో మొదటి సారిగా సీఎం కేసీఆర్ స్పందించి తమ గౌరవ వేతనాలను పెంచారు..ఆయనకు రుణపడి ఉంటాం’ అని పీఏసీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏసురెడ్డి దయాకర్ రెడ్డి అన్నారు. పీఏసీఎస్ చైర్మన్ల గౌరవ వేతనాలు పెంచడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఆ సంఘం ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్క్లబ్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి సందెల వెంకటేశ్, వర్కింగ్ ప్రెసిడెంట్ కె. మంజులా రెడ్డి, అధికార ప్రతినిధి ఆవుల రామారావు, ఉపాధ్యక్షులు నల్ల చంద్రశేఖర్ రెడ్డి, అలీ బిన్ అహ్మద్, ఎం. బుచ్చిరెడ్డి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు పోతుల మధుసూదన్ రెడ్డి, మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి కాసనగొట్టు లింగన్న, ఎన్. రాజన్న, సుదర్శన్ గౌడ్, నాగేశ్వర్ రావు దాసరి, నర్సింగ్ రావు పాల్గొన్నారు.