మహేశ్వరం, జనవరి 10: చక్కని దారులంటే ప్రగతికి మార్గమని చెబుతారు.. కానీ అదే పాపమో మన్సాన్పల్లి నుంచి నాగారం వెళ్లే రహదారి దుమ్మెత్తిపోస్తుంది. రెండు కిలోమీటర్ల మేర కంకర తేలి వాహనదారులు నిత్యం నరకం అనుభవిస్తున్న అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదు. మన్సాన్పల్లి నుంచి నాగారం వెళ్లే రహదారి పనులు ప్రారంభమై నెలల గడుస్తున్నా.. అధికారులు, ప్రజాప్రతినిధుల అలసత్వంతో రోడ్డు పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. ఈ రోడ్డు మీదుగా నిత్యం వేలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయి.
దాదాపు రెండు కిలోమీటర్ల మేర కంకర తేలి దుమ్మురేగుతుండటంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. పలుమార్లు వాహనదారులు ప్రమాదాలకు గురికావడంతో తీవ్ర గాయాలయ్యాయి. మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గతంలోనే నిధులు మంజూరు చేసి పనులు త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లకు ఆదేశాలిచ్చినా.. నెలల కొద్ది రోడ్డు పనులు నిలిచిపోవడంతో అధికారులపై ప్రజలు నిప్పులు చెరుగుతున్నారు. ఇప్పటికైన సంబంధిత అధికారులు నిద్రమత్తును వీడి పనులను పూర్తి చేయాలని ప్రజలు వేడుకుంటున్నారు.
దాదాపు రెండు కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణ పనులు కొన్ని రోజుల నుంచి నిలిచిపోయాయి. కొంతమేర నిధుల కొరతతో పనులు కాస్త ఆలస్యంగా జరుగుతున్నాయి. ప్రజలకు ఇబ్బందులు లేకుండా త్వరలోనే పనులు పూర్తి చేసేవిధంగా సంబంధిత కాంట్రాక్టర్కు ఆదేశాలిస్తాం.
– డీఈ సీతారామయ్య
మన్సాన్పల్లి నుంచి నాగారం మీదుగా శంషాబాద్కు వెళ్లే రోడ్డు నిర్మాణ పనులు కాంట్రాక్టర్ మధ్యలో నిలిపేశారు. రహదారిపై కంకర తేలి డస్టు ఉండటంతో విపరీతమైన దుమ్ము వస్తుంది. అనేకమార్లు వాహనదారులకు ప్రమాదాలు జరిగాయి. రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే ఆదేశాలిచ్చినా.. పనులు ముందుకు సాగటం లేదు. ప్రజల ఇబ్బందులను దృష్టితో పెట్టుకొని రోడ్డు నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి
– కంది అరుణ రమేశ్, మన్సాన్పల్లి సర్పంచ్