బంజారాహిల్స్, మే 29: బంజారాహిల్స్ రోడ్ నం. 10లో ఏపీ జెమ్స్ అండ్ జువెల్స్ పార్క్కు కేటాయించిన స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించిన వ్యవహారంలో ఏ-5 నిందితుడిగా ఉన్న బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ పేరును కేసులో నుంచి తొలగించినట్లు విశ్వసనీయ సమాచారం. సుమారు రూ.100 కోట్ల విలువైన అర ఎకరం స్థలంలో టీజీ విశ్వప్రసాద్ తరఫున గతనెల 17న సుమారు 70 మంది రౌడీలు వచ్చి కబ్జాకు పాల్పడిన సంగతి తెలిసిందే.
ఈ వ్యవహారంలో సినీ నిర్మాత పులిశెట్టి సుభాష్, జనసేన నేత మల్లప్పతో సహా మొత్తం 58 మందిని బంజారాహిల్స్ పోలీసులు నిందితులుగా చేర్చారు. 53 మందిని అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. ఇదిలా ఉండగా, ఈ కేసులో ఏ-5గా ఉన్న టీజీ వెంకటేశ్ పాత్రపై సరైన ఆధారాలు లభించకపోవడంతో ఆయన పేరును చార్జిషీట్ వేసే సమయంలో కేసులో నుంచి తొలగించనున్నారని, ఒకటి రెండురోజుల్లో పోలీసులు ఈ కేసుకు సంబంధించి చార్జిషీట్ను కోర్టులో దాఖలు చేయనున్నారని తెలిసింది.