Musi River | సిటీబ్యూరో, మార్చి 31 (నమస్తే తెలంగాణ): మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా హైడ్రాలిక్స్ మోడల్స్ రూపకల్పన కోసం పిలిచిన టెండర్ గడువు ఏప్రిల్ 6 వరకు పొడిగించారు. నగరం మధ్యలోంచి పారుతున్న మూసీ నది మురికి కూపంగా మారింది. దీన్ని పూర్తి స్థాయిలో సుందరీకరణ చేసేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఆర్డీసీఎల్)ను ఏర్పాటు చేసింది.
కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. 3 ఏండ్లలోనే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందులో భాగంగా గండిపేట, హిమాయత్సాగర్ల నుంచి ప్రారంభమయ్యే నదుల ప్రవాహ ప్రాంతాలను సమగ్రంగా అధ్యయనం చేసి అవసరమైన నివేదికలను రూపొందించేందుకు ‘సిమ్యులేషన్ మోడల్ ఫర్ హైడ్రాలిక్స్’ పేరుతో టెండర్లను పిలిచింది.
అనుభవం కలిగిన కన్సలెంట్ల ఎంపిక కోసం టెండర్లను ఏప్రిల్ 6 వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో ఎంఆర్డీసీఎల్ బృందం అధికారులు డ్రోన్ సర్వేను చేపడుతున్నారు. ఈ సర్వే ద్వారా వచ్చిన డేటాను ఉపయోగించి మూసీ నది ప్రవాహం తీరును అంచనా వేసి, ఎంపిక చేసిన కన్సల్టెంట్లు నివేదికలను రూపొందిస్తారని అధికారులు తెలిపారు.