మెదక్ : మెదక్ జిల్లా కేంద్రం ప్రభుత్వ ఆస్పత్రిని మంత్రి హరీష్ రావు గురువారం సందర్శించారు. కొవిడ్ బాధితులను పరామర్శించి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. జిల్లా ఆస్పత్రిలో 219 రెమ్డెసివర్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. మెదక్ జిల్లాలో సరిపడ ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. పేద ప్రజలు ప్రైవేటు ఆస్పత్రిలో చేరి డబ్బులు వృథా చేసుకోవద్దు అని సూచించారు.
ప్రాణాలను ఫణంగా పెట్టి పనులు చేస్తున్న వైద్య సిబ్బందిని మంత్రి హరీష్ రావు అభినందించారు. నిత్యావసర సరుకుల కోసం వచ్చేవారు ఇంటికి ఒక్కరే బయటకు వచ్చి తీసుకుని వెళ్లాలన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ కొరత గురించి మాట్లాడం జరిగిందని, త్వరలోనే వ్యాక్సిన్ అన్ని వయసుల వారికి ఇవ్వడం జరుగుతుందన్నారు. వ్యాక్సిన్ పట్ల అందరికీ అవగాహన కల్పించాలని అధికారులకు మంత్రి హరీష్ రావు ఆదేశాలు జారీ చేశారు.