Hyderabad | హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎండల తీవ్రత కొనసాగుతూనే ఉంది. పశ్చిమ దిశ నుంచి వీస్తున్న దిగువ స్థాయి గాలుల ప్రభావంతో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువలో నమోదవుతున్నాయి.
దీనికి తోడు గాలిలో తేమ శాతం తగ్గుముఖం పట్టడంతో పొడి వాతావరణం ఏర్పడి ఉక్కపోత నెలకొంటోంది. దీని వల్ల జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎండల తీవ్రత కారణంగా పగలు సమయంలో బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎండల తీవ్రత, వేడి గాలుల వల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశాలున్నాయని, జాగ్రతలు పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.