హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): పదమూడవ అమెరికా తెలుగు సాహితీ సదస్సు ఘనంగా నిర్వహించారు. అమెరికా కాలిఫోర్నియాలోని సిలికానాంధ్ర వర్సిటీ ప్రాంగణంలో రెండు రోజుల పాటు ఈ సదస్సు జరిగింది. ఇందులో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, సిలికానాంధ్ర వర్సిటీ తెలుగు శాఖ సంయుక్త నిర్వహణలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా ప్రముఖ రచయితలు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, కొలకలూరి ఇనాక్ పాల్గొన్నారు. సుమారు వెయ్యి మంది రచయితలు, కవులు, పండితులు, సాహితీవేత్తలు, భాషా, సాహిత్యాభిమానులు హాజరయ్యారు. 50 మంది సాహితీవేత్తలు వైవిద్యమైన అంశాలను వివరించారు. హరికథల నుంచి కవిత్వంలో గణితం వరకు ఆసక్తికరమైన ప్రసంగాలు చేశారు.
సత్యం మందపాటి, రాధిక నోరి, వేమూరి వెంకటేశ్వర్లు, కే గీత, కొండపల్లి నిహారిణి, ఫణి డొక్క, భాస్కర్ రాయవరం తదితరుల ప్రసంగాలు ఆకట్టుకొన్నాయి. ఈ సందర్భంగా అమెరికాలోని తెలుగు రచయితల సమాహారంతో రూపొందిన ‘అర్ధశతాబ్దిలో అమెరికా తెలుగు కథలు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రముఖ కవి కిరణ్ ప్రభ, క్రాంతి దంపతులకు జీవన సాఫల్య పురష్కారం అందించారు. ఆనంద్ కూచిభొట్ల, వంగూరి చిట్టెన్ రాజు అధ్యక్షతన జరిగిన సదస్సులో ఆచార్య మృణాళిని, హనిమిరెడ్డి లక్కిరెడ్డి, రాజు చామర్తి తదితరులు పాల్గొన్నారు.