Telemedicine | సిటీబ్యూరో: కేసీఆర్ సర్కార్ ప్రవేశపెట్టిన టెలీమెడిసిన్ సేవలు పేద రోగులకు వరంలా మారాయి. కరోనాకు ముందు ప్రారంభించిన ఈ సేవలు కొవిడ్ కష్టకాలంలో రోగులకు ఎంతో ఉపయోగపడ్డాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఉన్న అన్ని బస్తీ దవాఖానల నుంచి ఆన్లైన్ విధానంలో ఈ టెలీమెడిసిన్ సేవలు అందిస్తున్నారు. నిమ్స్, ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఎంఎన్జే, పేట్లబుర్జ్, సుల్తాన్బజార్ ప్రసూతి దవాఖానల ద్వారా కూడా సేవలు అందుబాటులో ఉన్నాయి.
టెలీమెడిసిన్ ద్వారా ఆర్థో, డెర్మటాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ, కార్డియాలజీ, ఆంకాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, న్యూరాలజీ తదితర సేవలను అందిస్తున్నారు. కేసీఆర్ సర్కారు తీసుకొచ్చిన టెలీ మెడిసిన్ సేవలతో వందలాది మంది రోగులు ఇంటి దగ్గరలోని బస్తీ దవాఖానల నుంచే నిమ్స్, ఉస్మానియా, గాంధీ వైద్యసేవలు పొందుతున్నారు. అంతే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించగలుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు.