దేశానికే దిక్సూచిగా తెలంగాణ పథకాలు
ప్రజా సంక్షేమంలో నంబర్వన్
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో మంత్రి మల్లారెడ్డి
మేడ్చల్ రూరల్, ఏప్రిల్ 16 : ప్రతి పేదింటి పెద్దన్న కేసీఆర్ అని, స్వరాష్ట్రంలో అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రజితారాజమల్లారెడ్డి , మేడ్చల్ మున్సిపాలిటీ కార్యాలయంలో చైర్పర్సన్ దీపికానర్సింహా రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడారు. కల్యాణలక్ష్మి, షాదీముబాకర్ పథకాలతో ప్రతి పేదింటి ఆడబిడ్డ పెండ్లికి రూ.లక్షా 116 అందజేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధిలో రాష్ర్టాన్ని నంబర్వన్ స్థానంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిలిపారన్నారు. తెలంగాణ పథకాలు దేశానికి దిక్సూచిగా మారాయని పేర్కొన్నారు.
ప్రతి ఏటా కేంద్రం ఎఫ్సీఐ ద్వారా ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. కానీ తెలంగాణ రాష్ర్టాన్ని అణగదొక్కాలని కుట్రలు పన్నుతున్నదని, యాసంగి ధాన్యం కొనలేమని చేతులెత్తేసిందని విమర్శించారు. తెలంగాణ రైతులకు అన్యాయం జరగొద్దని, పండించిన ప్రతి గింజనూ కొనేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 72 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని మంత్రి స్పష్టం చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శైలజావిజయేందర్ రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నందారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దయానంద్ యాదవ్, ప్రధాన కార్యదర్శి సుదర్శన్, పీఏసీఎస్ చైర్మన్లు సురేశ్ రెడ్డి, రణదీప్ రెడ్డి, నాయకులు రాజమల్లారెడ్డి, భాగ్యారెడ్డి, మద్దుల శ్రీనివాస్ రెడ్డి, జగన్ రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, తాసీల్లార్ గీత పాల్గొన్నారు. మున్సిపాలిటీ చెక్కుల పంపిణీలో వైస్ చైర్మన్ రమేశ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు శేఖర్ గౌడ్, సీఐ ప్రవీణ్ రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : మంత్రి
శామీర్పేట : ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆ దిశగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నదని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. శనివారం శామీర్పేట ఎంపీడీవో కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలన్నారు. శామీర్పేట మండలంలో 13 మందికి, తూంకుంట మున్సిపాలిటీలో 8 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ఎల్లూబాయిబాబు, జడ్పీటీసీ అనితలాలయ్య, తూంకుంట చైర్మన్ రాజేశ్వర్రావు, వైస్ చైర్మన్ వాణివీరారెడ్డి, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, కో ఆప్షన్ సభ్యులు, డిప్యూటీ తాసీల్దార్ శ్రీనివాస్రెడ్డి, లబ్ధిదారులు పాల్గొన్నారు.