మాదాపూర్, నవంబర్ 27: సాధారణ ప్రసవాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని, ఇతర రాష్ర్టాలతో పోల్చితే తెలంగాణలో 50 శాతం సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. మాదాపూర్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో కిమ్స్ కడల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మిసెస్ మామ్స్ 2022 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి విచ్చేసి ఎంటర్ప్రెన్యూర్ సంగీత, శతాబ్ది ఆర్గానిక్స్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ పార్టనర్ కాసు శ్రీ భాను, ఎస్బీయూ హెడ్, లైఫ్ సెల్ ఉపేంద్ర ప్రతాప్ సింగ్, కిమ్స్ గైనకాలజిస్ట్, డాక్టర్ శిల్పిరెడ్డితో పాటు కిమ్స్ వైద్య బృందంతో కలిసి ఆదివారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ .. రాష్ట్ర ప్రభుత్వం సాధారణ ప్రసవాలను ప్రోత్సహిస్తున్నదని, అనేక సార్లు కార్పొరేట్ దవాఖానలో సైతం పలుమార్లు సాధారణ ప్రసవాలను గురించి యాజమాన్యంతో చర్చలు జరిపినట్లు చెప్పారు.ఇతర రాష్ట్రాల తో పోలిస్తే తెలంగాణలో 50 శాతం సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయన్నారు.
తెలంగాణలో శిశు మరణాల శాతం అంతకంతకు తగ్గిందని, కేరళ, తమిళనాడుతో పాటు ఇతర రాష్ర్టాలతో పోల్చితే తెలంగాణలో 7 శాతం తగ్గినట్లు మంత్రి చెప్పారు. కేవలం ఆరు నెలల్లో 8300 మంది ఇతర రాష్ర్టాలకు చెందిన గర్భిణులు సాధారణ ప్రసవాలను తెలంగాణలో జరుపుకున్నట్లు తెలిపారు. ఇతర రాష్ర్టానికి చెందిన ఓ ఫైనాన్స్ మినిస్టర్ సోదరి సైతం తెలంగాణలో పురుడుపోసుకుందని తెలిపారు. గతంతో పోల్చితే 7 శాతం సి సెక్షన్ ప్రసవాలను తగ్గించగలిగామన్నారు. జన్మనిచ్చిన తల్లే శిశువుకు దేవతతో సమానమన్నారు. యోగా, వ్యాయామంతో తల్లి, బిడ్డ ఆరోగ్యం మెరుగుపడుతుందని, గర్భంతో ఉన్న మహిళ కుటుంబంలో భర్తతో పాటు కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చినట్లయితే మహిళలు మరింత ఆరోగ్యంగా ఉండేందుకు సహకారం అందుతుందన్నారు.
ఈ రోజుల్లో చాలా మంది ముహుర్తాలు చూసి దవాఖానలకు తీసుకెళ్తున్నారని, అలా చేయడం చాలా తప్పు అన్నారు. ప్రకృతికి విరుద్ధంగా పోవడం మంచిది కాదని, శిశువు జన్మించిన మొదటి గంటలో తల్లి పాలు పట్టించాలని, అవి శిశువు ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమన్నారు. ఈ సందర్భంగా మొదటి బహుమతి శైలజ, ద్వితీయ బహుమతి మనీషా, తృతీయ బహుమతి ప్రియ అందుకున్నారు.