సిటీబ్యూరో, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): దళిత బహుజన చైతన్యానికి ఆద్యుడు, తెలంగాణ తేజోమూర్తి మాదరి భాగ్యరెడ్డి వర్మ అని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. దళితుల చైతన్యానికి చదువును ఆయుధంగా మలిచిన చైతన్య స్ఫూర్తి అని పేర్కొన్నారు. శనివారం తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యాలయంలో భాగ్యరెడ్డి వర్మ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గౌరీశంకర్ మాట్లా డుతూ… భాగ్యరెడ్డి వర్మ, ఫూలే, అంబేదర్ల స్ఫూర్తితో సీఎం కేసీఆర్ దేశంలో ఎకడా లేని విధంగా రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల పిల్లల కోసం 1000కి పైగా గురుకులాలను నెలకొల్పారని తెలిపారు. రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు సీహెచ్ ఉపేంద్ర మాట్లాడుతూ.. విద్య ద్వారా దళిత బహుజన వర్గాల్లో చైతన్యం తెచ్చేందుకు కేసీఆర్ గురుకులాలు నెలకొల్పారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం అంబేద్కర్ స్టడీ సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ కొండా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.