ప్రజా యుద్ధ నౌక గద్దర్ ఉద్యమకారుడిగా, మహా విప్లవ కవిగా తన జీవితాన్ని తాడిత పీడిత ప్రజల కోసం త్యాగం చేశారని పలువురు ఉద్యమకారులు పేర్కొన్నారు. అమాయక ప్రజలను చైతన్యం చేసేందుకు ఒక రచయితగా, కవిగా ఎన్నో రచనలు, కవితలు, పాటలు రాసి తన గళంతో వినిపించి జనాలలో చైతన్య స్ఫూర్తిని రగిలించారని పలువురు ఆయనను గుర్తు చేసుకున్నారు. ఐదు దశాబ్దాల పాటు తన మాటలు, పాటలు, గొంతుతో ప్రజల్ని నడిపించిన యోధుడగా ఆయన సేవల్ని స్మరించుకున్నారు. ఎంతో మంది అభిమానులు, సన్నిహితులు గద్దర్తో తమకున్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. విప్లవకారుడిగా, ప్రజా వాగ్గేయకారుడిగా చివరి శ్వాస వరకు అణగారిన వర్గాల కోసం పోరాడారని చెప్పుకున్నారు.
– సిటీబ్యూరో, ఆగస్టు 7(నమస్తే తెలంగాణ)
గద్దర్ జ్ఞాపకాల కన్నీటి తడి
50 ఏండ్ల కింద అంటే 1973 అక్టోబర్లో వరంగల్ విరసం సాహిత్య పాఠశాల సమయంలో గద్దర్ పాటను మొదటిసారి విన్నాను. అప్పుడు ‘సృజన’లో ఆయన పాటలు అచ్చయ్యాయి. ఆయన పాటలోని విస్ఫోటన శక్తికి, గొంతులోని అద్భుత ఇంద్రజాలికత్వానికి, అభినయంలోని ఆశ్చర్యకరమైన వైవిధ్యానికి కుర్రవాడిగా సమ్మోహితుడినయ్యాను. ఆయన అభిమానుల్లో, అనుచరుల్లో, సహచరుల్లో ఒకడినయ్యాను. 1990 నవంబర్లో జరిగిన సభకు నేను అధ్యక్షత వహించాను. ఆయన జీవిత కాలంలో కోట్లాది మంది అభిమానులను కూడగట్టుకున్నారు. విప్లవోద్యమం, ప్రజా, సాంస్కృతిక ఉద్యమాలు, తెలుగు, విప్లవ సాహిత్యాలు అన్ని ప్రజానుకూల ఆచరణలోకి తీసుకొచ్చారు. ఆయన రాసిన రెండు పుస్తకాలను అచ్చు వేయించగలిగాను. ఆ అవకాశం నాకు ఇచ్చినందుకు చరిత్రకూ, గద్దర్కూ వినమ్ర నివాళి.
– ఎన్.వేణుగోపాల్, విప్లవ రచయిత, వీక్షణం ఎడిటర్
ఆత్మీయతకు మారు పేరు గద్దర్
విప్లవోద్యమం, దళితోద్యమంలో సంధించిన ప్రశ్నలకు స్పందించి నీల్-లాల్ సలామ్ సిద్ధాంతాన్ని కొనసాగించాలని చెప్పిన గద్దరన్న మరణం అణగారిన వర్గాలకు తీరని లోటు. 1990వ దశకంలో నిజామాబాద్లో నిర్వహించిన సిద్ధాంతపరమైన చర్చలో పాల్గొని పలు కీలక సూచనలు చేశారు. విప్లవోద్యమంలో మారోజు వీరన్న ప్రతిపాదించిన కులవర్గ సిద్ధాంతంతో గద్దర్ ఏకీభవించారు. 1990 నుంచి 2023 వరకు ఆయనతో అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాను. భారత రాజ్యంగాన్ని రక్షించుకోవాలని, అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కుపై చైతన్యం చేసిన సందర్భాలు ఆత్మీయతకు మారుపేరు. జనం గొంతుక గద్దర్ మరణం తెలంగాణ సమాజానికి తీరనిలోటు.
– పి.శంకర్, దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి
పాటకు ప్రాణ ప్రతిష్ట.. గద్దరన్న
బలహీన వర్గాలు, నిమ్న, సంచార జాతులు, కులాలకు సమానంగా హక్కులు లభించాలని బతికున్నంత కాలం పాటను ఆయుధంగా మలచి ఉద్యమ జీవితం గడిపిన ప్రజా గాయకుడు గద్దరన్న మరణం తీరనిలోటు. ఆయన పాటకు ప్రాణ ప్రతిష్ట చేశారని, తాను విద్యార్థి నాయకుడి దశ నుంచి నేటి వరకు అనేక వేదికల్లో పాల్గొన్నాను, ఆయనతో ఎన్నో జ్ఞాపకాలున్నాయి.
– డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు, చైర్మన్-బీసీ కమిషన్
గద్దర్ జీవితం స్ఫూర్తిదాయకం
సమాజానికి ప్రజా గాయకుడు గద్దర్ జీవితం స్ఫూర్తిదాయకం. ‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా ..పోరు తెలంగాణమా’ అని ఎలుగెత్తి చాటి తన ఆట, పాటలతో మలి దశ ఉద్యమానికి గద్దర్ ఊపు తెచ్చారు. సినీ దర్శకుడు బి.నర్సింగరావు వల్ల 1970లో నాకు గద్దర్తో అనుబంధం ఏర్పడింది. ‘మా భూమి, రంగుల కల, జైబోలో తెలంగాణ’ వంటి సినిమాల్లో ఆయనతో పాటే నేనూ పాల్గొన్నాను. గద్దర్ పిల్లలను మా స్కూల్లోనే చదివించారు. గద్దర్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. పాట బతికున్నంత కాలం గద్దర్ బతికే ఉం టారు. ప్రజా జీవితంలో తనదైన గాయక శైలి, ప్రదర్శన, కవితా రచనతో వందలాది కళాకారులకు ప్రేరణగా నిలిచారు.
– మణికొండ వేద కుమార్, చైర్మన్, తెలంగాణ రిసోర్స్ సెంటర్