తెలంగాణ రాష్ట్రం అత్యంత ప్రతిష్టాత్మక చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తుంది.. కంటి పరీక్షలు చేయించుకునే వారి కోసం అడ్డగుట్ట డివిజన్ పరిధిలో రెండు వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది. అడ్డగుట్ట బాబు జగ్జీవన్ రాం(బీజేఆర్) భవనం, తుకారాంగేట్ బోయబస్తీ కమ్యూనిటీ హాల్లో వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నారు. 18 ఏండ్లు పైబడిన ప్రతి ఒక్కరూ ఎలాంటి కంటి సంబంధిత సమస్యలు ఉన్నా వైద్య పరీక్షలను చేయించుకోవచ్చు. ప్రతి సెంటర్లలో వందకు పైగా ప్రతి రోజు పరీక్షలు చేయించుకొని కంటి అద్దాలను అందజేస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే వేలకు వేలు ఖర్చుల్లో అయ్యే చికిత్సను ఇక్కడ ఉచితంగా అందించడంతో ప్రజల నుండి మంచి స్పందన వస్తుంది. కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జీహెచ్ఎంసీ యూసీడీ విభాగం ఆధ్వర్యంలో అధికారులు, ఆర్పీలు ఇంటింటికీ తిరుగుతూ ప్రజలకు అవగాహనను కల్పించడం జరుగుతుంది.
– అడ్డగుట్ట, ఫిబ్రవరి 10
అడ్డగుట్ట బాబు జగ్జీవన్ రాం భవనంలో ఇప్పటివరకు 1867 మందికి స్కీనింగ్ నిర్వహించగా, అందులో 834 మందికి రీడింగ్ అద్దాలు అందించడం జరిగింది. 226 మందిని శస్త్రచికిత్స కోసం రిఫర్ చేశారు. తుకారాంగేట్ బోయబస్తీ కమ్యూనిటీ హాల్లో ఇప్పటివరకు 1680 మందికి స్కీనింగ్ నిర్వహించగా అందులో 675 మందికి రీడింగ్ అద్దాలు అందించడం జరిగింది. 158 మందికి ప్రీస్కిప్షనరీ గ్లాసెస్కు సిఫారస్ చేయడం జరిగింది. 299 మందిని శస్త్ర చికిత్స కోసం ఇతర దవాఖానకు రిఫర్ చేశారు.
కంటి వెలుగు కార్యక్రమం ద్వారా మెరుగైన వైద్య సేవలను అందించడం కోసం ప్రభుత్వం ప్రజలకు సువర్ణ అవకాశం అందిస్తుంది. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. చాలావరకు ప్రజలు వచ్చి వైద్యపరీక్షలను చేయించుకుంటున్నారు. ప్రతి ఒక్కరికీ నాణ్యమైన కంటి పరీక్షలను చేసి అద్దాలను అందిస్తున్నాము.
– సాయి శంకర్, అడ్డగుట్ట ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి.