జీడిమెట్ల/కుత్బుల్లాపూర్/మేడ్చల్/శామీర్పేట, జూన్ 5: శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్గా నిలిచిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం నూతనంగా ఏర్పాటు చేసిన సూరారం పోలీస్ స్టేషన్ను, పేట్ బషీరాబాద్లో నిర్మించిన మేడ్చల్ ట్రాఫిక్ జోన్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్తో కలిసి మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. అదేవిధంగా.. శామీర్పేట మండలం తుర్కపల్లిలోని జీనోమ్ వ్యాలీలో నూతన పోలీస్స్టేషన్ను కూడా మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. మేడ్చల్ జిల్లాలో కొత్తగా తొమ్మిది పోలీస్ స్టేషన్లు, రెండు డీసీపీ కార్యాలయాలు, మూడు ఏసీపీ కార్యాలయాలు ఏర్పాటయ్యాయని అన్నారు. రాష్ట్రం ఏర్పాటు కాకముందు 60-70 పోలీస్ స్టేషన్లు మాత్రమే ఉంటే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కొత్తగా 70 పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసుకున్నామన్నారు. ప్రజలకు భద్రతతో పాటు ్రక్రైమ్ను కూడా తగ్గించేందుకు నూతన పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేసుకున్నామన్నారు. నేరం జరిగిన గంట వ్యవధిలోనే నిందితులను పట్టుకునే పోలీస్ వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో ఉండటం వల్లే రాష్ర్టానికి వరుస పెట్టుబడులు వస్తున్నాయన్నారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడుతూ.. పరిపాలనా సౌలభ్యం కోసమే కొత్త పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, మేడ్చల్ జోన్ డీసీపీ సందీప్ గోనే, మేడ్చల్ ట్రాఫిక్ జోన్ డీసీపీ డీవీ శ్రీనివాసరావు, ఏసీపీ వెంకట్ రెడ్డి, సూరారం సీఐ ఎం.వెంకటేశ్వర్ రావు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కొత్త ట్రాఫిక్ ఠాణాలు ;సీపీ స్టీఫెన్ రవీంద్ర
రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కమిషనరేట్ పరిధిలో కొత్త ట్రాఫిక్ జోన్తోపాటు ట్రాఫిక్ పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. గచ్చిబౌలిలో నూతనంగా నిర్మించిన మాదాపూర్ ట్రాఫిక్ డీసీపీ కార్యాలయంతోపాటు అదనపు ట్రాఫిక్ డీసీపీ కార్యాలయాన్ని సోమవారం ట్రాఫిక్ జాయింట్ సీపీ నారాయణ్ నాయక్తో కలిసి సీపీ స్టీఫెన్ రవీంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెరుగుతున్న ట్రాఫిక్కు అనుగుణంగా నూతనంగా నార్సింగి, మేడ్చల్, రాయదుర్గం, అర్సీ పురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం ట్రాఫిక్ టాస్ఫోర్స్ వంటి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ లా అండ్ ఆర్డర్ డీసీపీ శిల్పవల్లి, ఏడీసీపీ నంద్యాల నరసింహారెడ్డి, ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ రెడ్డి, గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ సురేశ్, మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ హనుమంత రావు, గచ్చిబౌలి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నవీన్, మాదాపూర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నర్సయ్య, రాయదుర్గం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.
రాయదుర్గం ట్రాఫిక్ పీఎస్..
నూతనంగా నిర్మించిన రాయదుర్గం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ హనుమంత రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాయదుర్గం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
అల్లాపూర్ పీఎస్..
అల్లాపూర్ రాజీవ్గాంధీనగర్లో ఏర్పాటు చేసిన నూతన అల్లాపూర్ పోలీస్స్టేషన్ను సోమవారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్కుమార్, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, స్థానిక కార్పొరేటర్ సబీహాబేగం ప్రారంభించారు.