-‘మన ఊరు.. మన చెట్టు’ అంశంపై నాలుగు భాషల్లో కథలు ఆహ్వానం
– ప్రతి మండలంలో ఒక్కో భాష నుంచి 5 కథలు పరిశీలన
– జిల్లా, రాష్ట్ర స్థాయిలలో విజేతలకు బహుమతులు
జూబ్లీహిల్స్ : రచనా వ్యాసాంగంపై విద్యార్థుల్లో ఆసక్తి పెంపొందించేందుకు ‘తెలంగాణ సాహిత్య అకాడమీ’ పాఠశాల విద్యార్థులకు కథల పోటీలు నిర్వహించాలని నిర్ణయించింది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులందరూ ఈ కథల పోటీల్లో పాల్గొనవచ్చు. ‘మన ఊరు.. మన చెట్టు’ అన్న అంశంపై నాలుగు భాషల్లో కథలను ఆహ్వానిస్తున్నారు.
తెలుగు, ఆంగ్లం, హిందీతో పాటు మరే భాషలోనైనా విద్యార్థులు స్వేచ్చగా తమ కలంతో కథలు రాయవచ్చు. ప్రతి మండలంలో ఒక్కో భాష నుంచి 5 కథలు పరిశీలన చేసి విజేతలను ఎంపికచేయనున్నారు. పాఠశాలల్లో చేపడుతున్న వంద రోజుల పఠన కార్యక్రమంలో భాగంగా ఈ బహుబాషా కథల పోటీలను నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా ఈనెల 4 న మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు అన్ని పాఠశాలల్లో కథల పోటీలు నిర్వహించనున్నారు. ఒక మండలం నుంచి విద్యార్థులు రాసిన కథలలో ఒక్కో భాష నుంచి 5 కథలను ఎంపిక చేసి ఈనెల 7 లోగా జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి పంపించనున్నారు.
జిల్లా, రాష్ట్ర స్థాయిలలో నిర్వహిస్తున్న ఈ పోటీలలో విజేతలకు ‘తెలంగాణ సాహిత్య అకాడమీ’ బహుమతులు అందజేయనుంది.