హైదరాబాద్, జనవరి 13 : కొవిడ్ టీకాల పంపిణీలో రాష్ట్రం మరో మైలురాయిని అధిగమించింది. మొదటి డోస్ 100 శాతం పూర్తి చేసిన తొలి పెద్ద రాష్ట్రంగా రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో కొవిడ్ టీకాల పంపిణీ 5 కోట్ల డోసులు దాటింది. గతనెల 9న 4 కోట్ల మైలురాయిని అధిగమించగా.. గడిచిన 35 రోజుల్లో వైద్యసిబ్బంది మరో కోటి టీకాల పంపిణీ పూర్తిచేశారు. గురువారం నాటికి రాష్ట్రంలో మొదటి డోస్ 2.93 కోట్ల మందికి, రెండో డోస్ 2.06 కోట్ల మందికి, ప్రికాషన్ డోస్ (బూస్టర్ డోస్) 1.13 లక్షల మందికి వేశారు. 15-18 ఏండ్ల వారికి 8.67 లక్షల మందికి వ్యాక్సినేషన్ పూర్తయింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 3,778 ప్రభుత్వ, ప్రైవేటు సెంటర్లలో టీకాలు వేస్తున్నారు. మొదటిడోస్ లక్ష్యానికి మించి (దాదాపు 103 శాతం మందికి) పంపిణీ చేయగా, రెండో డోస్ 74 శాతం మందికి వేశారు.
వైద్య, ఇతర శాఖల సిబ్బందికి మంత్రి హరీశ్ అభినందన
టీకాల పంపిణీ 5 కోట్ల డోసులు దాటిన సందర్భంగా వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు హర్షం వ్యక్తంచేశారు. క్షేత్రస్థాయిలో నిరంతరం వ్యాక్సినేషన్ కోసం కృషిచేస్తున్న వైద్యశాఖతోపాటు పంచాయతీ, మున్సిపల్, ఇతర శాఖల సిబ్బందిని అభినందించారు. టీకాలు, కొవిడ్ జాగ్రత్తలు మాత్రమే కరోనా బారినుంచి కాపాడుతాయని చెప్పారు. ప్రతిఒక్కరూ రెండు డోసుల టీకాలు వేసుకోవాలని, మాస్కు విధిగా ధరించాలని, చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని పునరుద్ఘాటించారు.
పది 100% వ్యాక్సినేషన్ రాష్ర్టాల్లో తెలంగాణ
కొవిడ్ వ్యాక్సినేషన్ను వంద శాతం పూర్తిచేసిన టాప్ టెన్ రాష్ట్రాల్లో తెలంగాణ నిలిచిందని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. వ్యాక్సినేషన్, కరోనా నియంత్రణ చర్యలపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో గురువారం సాయంత్రం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ప్రధాని ఈ అంశాన్ని వెల్లడించారు. కరోనా కట్టడికి ఇదేవిధంగా చర్యలు కొనసాగించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు, వైద్యవిద్య డైరెక్టర్ రమేశ్రెడ్డి పాల్గొన్నారు.