మెహిదీపట్నం/ జియాగూడ, మే 15 : తెలంగాణ పోలీసు వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. కార్వాన్ నియోజకవర్గంలోని జియాగూడలో రూ.4.26 కోట్లతో నిర్మించిన కుల్సుంపురా పోలీస్ స్టేషన్ భవనాన్ని, మెహిదీపట్నం ప్రధాన చౌరస్తా సమీపంలో నూతనంగా నిర్మించిన హుమాయూన్నగర్ పోలీస్ స్టేషన్ భవనాన్ని సోమవారం పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ ఎంఎస్.ప్రభాకర్ రావు, ఎమ్మెల్యేలు జాఫర్మెరాజ్ హుస్సేన్, కౌసర్మొహినుద్దీన్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్గుప్త, డీజీపీ అంజనీకుమార్, కమిషనర్ సీవీ ఆనంద్లతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కుల్సుంపురా పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన వేదికపై హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి సీఎం కేసీఆర్ పారదర్శక పాలనలో పోలీసులు ప్రజలతో మెరుగైన సంబంధాలు ఏర్పర్చుకొని వారి సమస్యలు పరిష్కరించడంలో విజయం సాధిస్తున్నారని అన్నారు. గడిచిన ఏనిమిదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీసుతో పాటు పోలీసు శాఖలలో అనేక సంస్కరణలు చేపట్టిందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి సీసీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేసి ప్రజలకు భద్రత కల్పిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ పోలీసు శాఖకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తున్నారని, పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని త్వరగా కేసులు ఛేదిస్తున్నారని చెప్పారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల కోసం ప్రవేశపెడుతున్న ప్రతి పథకాన్ని ఇతర రాష్ర్టాలు, కేంద్ర ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుంటుందని అన్నారు. అంతకుముందు మహిళా కానిస్టేబుల్తో హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడారు. తర్వాత సీసీ కెమెరాల గది, ఇన్స్పెక్టర్ కార్యాలయం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి ముందుగా జీడీ రాశారు. అనంతరం ఇన్స్పెక్టర్ కె.నారాయణరెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, నగర ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ సుధీర్ బాబు, పశ్చిమ మండలం డీసీపీ జోయల్ డేవిస్, దక్షిణ, పశ్చిమ మండలం డీసీపీ కిరణ్ఖరె, గోషామహల్ ఏసీపీ సతీష్కుమార్, ఆసిఫ్నగర్ ఏసీపీ ఆర్జీ.శివమారుతి, ఆసిఫ్నగర్ తాసీల్దార్ షేక్ ఫర్హిన్, కార్పొరేటర్లు బోయిని దర్శన్, మాజీద్ హుస్సేన్, ఎండీ.నసీరుద్దీన్, స్వామి యాదవ్, మాజీ కార్పొరేటర్ మిత్రకృష్ణ, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కావూరి వెంకటేశ్, డాక్టర్ బాబుజగ్జీవన్ రాం ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ కొమ్ముల నరేందర్, తదితరులు పాల్గొన్నారు.