HomeHyderabadTelangana Literature Day Was A Feast For The Eyes
సాహితీ పట్టాభిషేకం
‘తెలంగాణ... గంగా జమునా తెహజీబ్' అన్న మహాత్ముడి మాటలే స్ఫూర్తిగా ఆదివారం దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ సాహితీ దినోత్సవం కన్నుల పండువగా సాగింది. రవీంద్రభారతి వేదిక జరిగిన బహుభాషా కవి సమ్మేళనం ఆద్యంతం ఆసక్తిగా సాగింది.
కన్నుల పండువగా సాహిత్య దినోత్సవం
దశాబ్ది వేడుకల్లో గళమెత్తిన తెలుగు, ఉర్దూ కవిత్వం
ఆద్యంతం ఆసక్తిగా సాగిన బహుభాషా సమ్మేళనం
సిటీబ్యూరో, జూన్ 11 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణ… గంగా జమునా తెహజీబ్’ అన్న మహాత్ముడి మాటలే స్ఫూర్తిగా ఆదివారం దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ సాహితీ దినోత్సవం కన్నుల పండువగా సాగింది. రవీంద్రభారతి వేదిక జరిగిన బహుభాషా కవి సమ్మేళనం ఆద్యంతం ఆసక్తిగా సాగింది. మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీలు ముఖ్యఅతిథులుగా హాజరైన ఈ కవి సమ్మేళనంలో తెలుగు – ఉర్దూ కవులు పద్య, వచన కవిత్వాలను చదివి వినిపిస్తుండగా సభికులు చప్పట్లతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఒకదానిని మించి మరొకటి.. అక్షరాల కూర్పుల్లో నేర్పు.. పదాల అల్లికలో పదనిసలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. స్వరాష్ట్రంలో సాహితీ వికాసాన్ని చూసి ప్రతి ఒక్కరి హృదయాలు ఉప్పొంగాయి.
స్వయంగా కవి, రచయిత అయిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సాహితీ వైభవం తెలంగాణకే గర్వకారణమని వక్తలు కొనియాడారు. అనంతరం ప్రముఖ కవులను మంత్రులు సత్కరించారు. ఉర్దూ కవులకు మక్దూం మొయినుద్దీన్ జీవితసాఫల్య పురస్కారం ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, ప్రముఖ కవి గోరేటి వెంకన్న, సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్, ప్రిన్పిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, మైనార్టీ వెల్ఫేర్ కమిషనర్ షఫీ ఉల్లా, ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దిన్, సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ దీపిక రెడ్డి, అధికార భాష సంఘం చైర్మన్ శ్రీదేవి మంత్రి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు
బహుభాషా కవి సమ్మేళనంలో కవులు తమ పద్యాలను వినిపిస్తూ తన్మయత్వం చెందారు. గతం, ప్రస్తుత పరిస్థితులను కండ్లకు కట్టినట్టుగా పద్యాలను ఎలుగెత్తారు. సాహిత్యానికి విలువనిచ్చిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామంటూ పదాల అల్లికలతో అభిమానాన్ని చాటారు. తొమ్మిదేండ్ల తెలంగాణ అభివృద్ధిని గురువులు, లఘువులతో.. ఛందోబద్ధంగా అల్లిన పద్యాలతో తెలంగాణ వృద్ధిని చాటారు. ‘కోటి ఎకరాల మాగాణి కోర్కెదీర్చ/ చినుకుపిలుపు నేలమ్మ చిందులేయ/ స్వర్ణ తెలంగాణ లక్ష్మి సాక్షాత్కరింప/ఐకమత్సము తోడ దశాబ్ది వేళ/ జయము జయమందు ఎత్తుడి జయపతావ్!’ అంటూ ఆనంద దశాబ్ది శీర్షికతో ఉద్యమాలకు ఊపిరిలూదిన కేసీఆర్ను కీర్తిస్తూ.. రుక్మాభట్ల కృష్ణమూర్తి రాసిన ఈ పద్యం వేదికపై చదువుతుండగా సభికుల నుంచి హర్షాతిరేకలు వ్యక్తమయ్యాయి.
‘ఉంటారు కొందరు నిరంతర శాడిస్ట్లు / యజ్ఞకుండాల్లో రక్తభాండాలను కుమ్మరించేవాళ్లు/ నడిచే కాళ్లలో కట్టెలను చొప్పిస్తూ../ అహర్నిశలు బోర్లాపడేస్తూ హాహాకారం చేసేవాళ్లు/ఎక్కడో ఒక మచ్చను వెదుకుతూ.. రొచ్చు కుళ్లు చరిత్రలను మెడలో ధరించిన వాళ్లు సముద్రతీరంపై మొరుగుతూనే ఉంటాయి/ఐతే కార్శశూరుడు భయపడడు.’ అంటూ రాష్ట్ర అభివృద్ధిని ఓర్వలేక అసత్యాలను ప్రచారం చేసే వారిని చెడుగుడాడుతూ కేసీఆర్ పాలన భేష్ అంటూ ప్రొఫెసర్ రామా చంద్రమౌళి పద్యం వినిపించారు.
‘నెర్రలు బారిన నేలమీద నీటి మొక్కలు మొలిచిన సవ్వడి/ పల్లెపల్లెలో పక్షుల కిలకలారావాల సంగీత కచేరి/ పూడిక తీసిన చెరువుల్లో జలసిరుల తళుకుబెళుకులు/ మొన్నటినీ నిన్నటినీ దాటి నేడు ఉరుకులెత్తే అద్భుత దృశ్యం/ ఊహకందని సకారాత్మక ఆచరణకు పూచిన అపురూప పుష్పం/అదొక భగీరథ యత్నం.’ అంటూ పొట్లపల్లి శ్రీనివాసరావు వినిపించారు.
‘అతడొక స్పాప్నికుండు మహితాత్ముడు ధీరుడు వీరపుత్రుడౌ/నతడొక భవ్య దార్శనికుడన్నము పెట్టెడు రైతు నేతయౌ/నతడిల చంద్రశేఖరుని యంశను బుట్టిన ముఖ్యమంత్రియే/ప్రతి తెలంగాణ పల్లెకును పావనగంగను దింపె దీక్షతో..! అంటూ మరుమాముల దత్తాత్రేయ శర్మ పద్యం వినిపించారు. డాక్టర్ సంధ్యా, టీచర్ వేలేటి నీరజ తదితరులు తమ పద్యాలను వినిపించి రాష్ట్ర అభివృద్ధిని కండ్లకు కట్టారు.
సాహిత్యానికి పడమటి ఇల్లు
మాది నల్గొండ. 40 ఏండ్ల నుంచి కవిత్వం రాస్తున్నాను. కానీ ఏనాడు హైదరాబాద్ వేదికగా ఉమ్మడి పాలనలో నా పద్యాన్ని చదవడానికి అవకాశం రాలేదు. ఆనాటి ప్రభుత్వాలు కవులను పట్టించుకోలేదు. అస్సలు కవులకు గుర్తింపు అనేది సాధ్యం కాదని బాధపడేవాణ్ని. కానీ తెలంగాణ వచ్చాక ఈ తొమ్మిదేండ్లలో సాహిత్యానికి విలువ పెరిగింది. అక్షరానికి గౌరవం దక్కింది. ఇప్పుడు కవిత్వానికి పడమటి ఇల్లుగా తెలంగాణ మారింది.
– వెంకట్, తెలంగాణ జీవకవి
కేసీఆర్ పోరాటమే మా కవిత్వం
నేను ఆదివాసి బిడ్డను. ఉమ్మడి పాలనలో అవకాశాలు మాకు అందని ద్రాక్ష. మా గోడు వినేవాళ్లు లేకపోయేది. నేను కష్టపడి చదువుకుని డాక్టర్ అయ్యాను. తెలంగాణ రాష్ట్రం సాకారమైతే తప్ప ఈ ప్రాంతం అభివృద్ధి జరిగదని అనుకునేది. రాష్ట్రం కోసం కేసీఆర్ తపించిన విధానం, ఆయన చేసిన పోరాటమే ఇప్పుడు నన్ను కవిత్వం రాయడానికి ఉసిగొల్పింది. కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని అక్షరీకరించాల్సిన బాధ్యత మా కవులందరిపైనా ఉంది.
– డాక్టర్ సంధ్యా విప్లవ్, వరంగల్
సాహిత్యాభిలాషి కేసీఆర్
కేసీఆర్లో సహజసిద్ధంగానే సాహిత్యంపైన అభిరుచి ఉంది. అక్షరాన్ని గౌరవించే గుణం చిన్నతనం నుంచే ఉంది. అతడు నా స్టూడెంట్. అన్యాయాన్ని సహించే వాడు కాదు. ఇదేంటని ప్రశ్నించే తత్వం అతడిది. పదో తరగతి చదువుతున్నప్పుడు తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై కూడా చర్చకు వచ్చేది. ఏక సంతాగ్రహి. అతడు ముఖ్యమంత్రి అయి తెలంగాణను అభివృద్ధి చేసే అదృష్టం దక్కడం గొప్ప విషయం.
– రుక్మాభట్ల కృష్ణమూర్తి, ప్రముఖ కవి, రిటైర్డ్ టీచర్
ఒక్కో పథకం రామబాణం
పంటలు పండక..నీళ్లు లేక… తినడానికి తిండిలేని దుస్థితి తెలంగాణలో ఉండేది. ఉమ్మడి పాలనలో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైంది. నేడు అభివృద్ధిలో పరుగులు తీస్తుంది. కేసీఆర్ తీసుకొచ్చిన ఒక్కో పథకం ఒక్కో రామబాణంలా కష్టాలను చీల్చి చెండాడుతుంది. ఇది మా తెలంగాణ అంటూ గర్వంగా చెప్పుకుంటున్నాం. కవులకు, రచయితలకు గౌరవం దక్కింది.
– వేలేటి నీరజ, కవి, నారాయణ్ఖేడ్
సాహిత్యానికి విలువ
కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్రం అభివృద్ధి జరుగుతోంది. సాహిత్యానికి విలువ పెరిగింది. మేం కవులమని గర్వంగా చెప్పుకునే స్థాయికి ఎదిగాం. నా చిన్నతనంలో గొట్టిముక్కుల నుంచి పరిగి వరకు చదువుకోవడానికి 19 కిలో మీటర్లు కాలినడకన నడిచాను. అప్పటి పరిస్థితులపై పద్యాలు రాశాను. తొమ్మిదేండ్లలో మనం చూస్తున్న తెలంగాణ అభివృద్ధి దేశంలో ఎక్కడా లేదనడంలో అతిశయోక్తి లేదు.
– దోరవేటి చెన్నయ్య, కవి
సాహితీవేత్తలకు సరైన గౌరవం
కవులకు, రచయితలకు ఇంత గౌరవం అందించిన ముఖ్యమంత్రులు దేశంలో ఎవ్వరూ లేరు. కేసీఆర్ ఒక్కరే సాహిత్యానికి ఊపిరిలూదారు. ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసి ప్రతీ కవికి, రచయితకు సముచిత స్థానం కల్పిస్తున్నారు. తెలంగాణ చరిత్ర అంటే ఒకప్పుడు హృదయవిదారక పరిస్థితులే గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు తెలంగాణలో కొత్త చరిత్రను సీఎం కేసీఆర్ లిఖించారు.
– ప్రొఫెసర్ రామాచంద్రమౌళి, కవి, వరంగల్
తెలంగాణలో సాహిత్య సంపద
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సాహిత్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా 2 వేల మంది కవులు, రచయితలు కవి సమ్మేళనంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్ని రంగాల్లో ఎలాగైతే ఆదర్శంగా ఉందో అలాగే సాహిత్య, సాంస్కృతిక రంగాల్లోనూ ఆదర్శంగా ఉంది. తెలంగాణలో ఆర్థిక సంపదతో పాటు సాహిత్య, సాంస్కృతిక సంపద కూడా ఉంది. తెలంగాణలో ఉన్నట్టుగానే గంగా జమున తెహజీబ్ సంస్కృతి దేశమంతా ఉండాలి. మనుషుల మధ్య ఐక్యత కావాలి. రాష్ట్ర అభివృద్ధిపై కవులు, రచయితలు చేసిన రచనలు అద్భుతంగా ఉన్నాయి.
– జూలూరు గౌరీశంకర్, తెలంగాణ సాహత్య అకాడమీ చైర్మన్