బంజారాహిల్స్, జనవరి 28: పేద ప్రజల సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో దేశంలోనే నంబర్వన్ రాష్ట్రంగా నిలుస్తున్న తెలంగాణ వైపు అన్ని రాష్ర్టాలు చూస్తున్నాయని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. వెంకటేశ్వరకాలనీ డివిజన్ పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే దానం నాగేందర్ శనివారం ఎమ్మెల్సీ ఎంఎస్.ప్రభాకర్రావు, కార్పొరేటర్ మన్నె కవితారెడ్డితో కలిసి ప్రారంభించారు. బంజారాహిల్స్ రోడ్ నం.3లోని జర్నలిస్ట్ కాలనీలో రూ.20లక్షల వ్యయంతో చేపట్టనున్న తాగునీటి లైన్ పనులను ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రారంభించారు. ఈ ప్రాం తంలో మూడుచోట్ల తాగునీటి సరఫరాను మెరుగుపర్చేందుకు కొత్త లైన్లు వేయాలని స్థానికుల కోరిక మేరకు పనులు ప్రారంభించామని ఎమ్మెల్యే దానం తెలిపారు. అనంతరం ప్రతాప్నగర్ను అనుకుని ఉన్న సర్దార్జీ గల్లీలో రూ.15లక్షల వ్యయంతో వేసిన వీడీసీసీ రోడ్డును ప్రారంభించారు. అదే వీధిలో రూ.4లక్షల వ్యయంతో తాగునీటి లైన్పనులు ప్రారంభించారు. బస్తీవాసుల అవసరం కోసం రూ.5.5లక్షల నిధులతో వేసిన బోర్వెల్తో పాటు సింటెక్స్ ట్యాంకును ఎమ్మెల్యే దానం, ఎమ్మెల్సీ ప్రభాకర్రావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాలు అద్భుతమైన విజయాలు సాధిస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సహకారం ఇవ్వకపోగా బీజేపీ నాయకులు రాష్ట్ర గవర్నర్ను అడ్డుపెట్టుకుని రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాజ్యాంగబద్ధమైన గవర్నర్ పదవిలోకి వచ్చిన తర్వాత రాజకీయలను వదిలిపెట్టాల్సి ఉంటుందని, తమిళనాడు రాష్ట్రం బీజేపీ అధ్యక్షురాలిగా గతంలో పనిచేసిన తమిళసై మాత్రం రాజ్భవన్ వేదికగా రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఇప్పటికైనా గవర్నర్ పద్ధతి మార్చుకుని రాజ్యాంగ పదవికి వన్నె తేవాలన్నారు.
అనంతరం ఎమ్మెల్సీ ఎంఎస్.ప్రభాకర్రావు మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో పరుగులు పెడుతోందన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో వందల కోట్లతో అభివృద్ది పనులు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు రాములు చౌహాన్, నాయకులు మాదాస్ ఆనంద్కుమార్, మల్లేశ్ యాదవ్, అశోక్, స్వరూప్, రాజు, నల్ల శివమాదిగ, గణేశ్, జగ్దీప్ సింగ్, అమిత్ సింగ్, రణ్దీప్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.