వ్యవసాయ యూనివర్సిటీ, జూన్ 7: సాగు నీటి రంగానికి సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తు నిధులు కేటాయించి త్వరితగతిన ప్రాజెక్టులు నిర్మించడంతో నేడు మండు టెండల్లో నిండుకుండలను తలపిస్తున్నాయని రాజేంద్రనగర్ ఎమ్మె ల్యే టి.ప్రకాశ్ గౌడ్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాజేంద్రనగర్లోని వాలంతరీలో ఏర్పాటు చేసిన ‘సాగునీటి’ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఒకప్పటి బీడుభూములన్నీ నేడు పచ్చటి పంట పొలాలుగా మారాయని, సాగునీటికి ముఖ్యమంత్రి కేసీఆర్ అధిక ప్రాధాన్యత కల్పించడం వల్లే నేడు దేశానికి అన్నం పెట్టే స్థితికి చేరామని పేర్కొన్నారు. గత సీఎంలకు సోయిలేక హైదరాబాద్ నగరంలోని బంజరాహిల్స్లో ఇల్లు కట్టుకోవడం తప్పా ఈ ప్రాంత ప్రజలకు చేసిందేమీ లేదన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో పేరుకు మాత్రమే ప్రారంభించి వదిలేనిన కోయిల్సాగర్, నెట్టెంపాడు, కల్వకుర్తిలాంటి అనేక ప్రాజెక్టులను త్వరిత గతిన పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్ది అని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్న ముందుతరాలకు అవసరమగు తాగునీరు, సాగు నీరు వంటి శాశ్వత పథకాలు అమలు చేశారని కొనియాడారు. కృష్ణా, గోదావరి నుంచి సాగు నీటికే కాకుండా తాగునీటికి నగరమంతా సరఫర చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. నేడు మణికొండ, నార్సింగ్, అవుటర్ రిండ్ రోడ్లు చూస్తుంటే అభివృద్ధిచెందిన దేశాలను తలపిస్తున్నాయన్నారు. రాజేంద్రనగర్ జీహెచ్ఎం పరిధిలోని 18 చెరువులను రూ.26.32కోట్లతో మరమ్మతులు చేపట్టారన్నారు. రూ. 41.36 కోట్లతో చెరువుల నుంచి ము రుగు నీరు మళ్లింపు, చెరువు కట్ట ఆధునీకరణ, తూముల మరమ్మతులు, ఫెన్సింగ్, సుందరీకరణ తదితర పనులు చేపట్టారన్నారు.
గతంలో చెరువుల నీటి సామర్థ్యం 477 ఎంసీఎఫ్టీ ఉండగా, మిషన్ కాకతీయ అనంతరం చెరువుల సామర్థ్యం 503 ఎంసీఎఫ్టీలు పెరిగిందన్నారు. చెరువుల్లో చేపల పెంపకం ఘననీయంగా పెరిగిందన్నా రు. నియోజక వర్గంలోని గండిపేట పెద్ద చెరువును మినీ ట్యాంక్బండ్గా రూ.26.12 కోట్లతో అభివృద్ధి చేశారని గుర్తుచేశారు.నియోజకవర్గంలోని 40 చెరువులకు రూ. 325 లక్షల ఖర్చుతో అభివృద్ధి చేశామన్నారు. అంతకు ముందు రాష్ట్రంలో చేపట్టిన సాగునీటి పారుదల ప్రాజెక్టు ల నిర్మాణం, చెరువుల పునరుద్ధరణ, చెక్డ్యామ్ల నిర్మా ణం, దీని వల్ల కల్గిన లాభాలు తదితర అంశాలపై వీడియోలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో బండ్లగూడ మేయర్ మహేందర్ గౌడ్, శంషాబాద్ మున్సిపల్ చైర్మన్ సుష్మ, ఇరిగేషన్ ఈఈ కుశాల్కర్, ఆర్డీఓ చంద్రకళ, ఎంపీపీ జయమ్మ, జడ్పీటీసీ తన్విరాజ్, ఏఎంసీ చైర్మన్ వెంకటేశ్ గౌడ్, ఇరిగేషన్ ఏఈ విశ్వం, విక్రమ్, మౌనిక, కార్పొరేటర్ సాగర్ గౌడ్ పాల్గొన్నారు.