అమీర్పేట్ : సీఎం కేసీఆర్ సారధ్యంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుంజలో సాగుతోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పురష్కరించుకుని గురువారం బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఆధ్వర్యంలో ఎల్లమ్మ అమ్మవారికి దాతలు సమకూర్చిన బంగారు జడ, పాదాలు, కాసుల పేరును కవిత అమ్మవారికి సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సీఎం కేసీఆర్ ఆయురా రోగ్యాలతో వర్ధిల్లాలని కోరుతూ నిర్వహించిన మహా మృత్యుంజయ హోమంలో ఆమె పాల్గొన్నారు.
గురుద్వారాలో ప్రత్యేక ప్రార్ధనలు..
గురుద్వారా ప్రబంధక్ కమిటీ అమీర్పేట్ వారి ఆధ్వర్యంలో రాష్రైం సుభిక్షంగా ఉండాలని కోరుతూ.. సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ జరిగిన ప్రత్యేక ప్రార్ధనల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. అనంతరం గురుద్వారా సమీపంలో మన్మీత్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత వైద్య పరీక్ష శిబిరంలో పాల్గొని పరీక్షలు చేయించుకున్నారు.