పీర్జాదిగూడ, ఆగస్టు 27: అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్గా నిలుస్తున్నదని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీ, ఎంబీసీ సంచార కులాలకు ఖరీదైన స్థలాల్లో ఆత్మగౌరవ భవనాలకు వందలాది కోట్లు మంజూరు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతున్నదన్నారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 199 సర్వే నంబర్లో చాత్తాద శ్రీ వైష్ణవులకు రాష్ట్ర ప్రభుత్వం ఎకరా భూమి కేటాయించిన విషయం తెలిసిందే. రూ.కోటి నిధులతో చేపట్టిన ఆత్మగౌరవ భవన నిర్మాణానికి మంత్రులు గంగుల కమలాకర్, చామకూర మల్లారెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు, మేయర్ జక్క వెంకట్రెడ్డితో కలిసి ఆదివారం భూమిపూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మొదట పూర్ణ కుంభంతో మంత్రులకు వేద మంత్రోచ్ఛారణల మధ్య సంఘం ప్రతినిధులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. గత పాలకుల పాలనలో వైష్ణవులకు న్యాయం జరగలేదని, సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత అన్ని కులాలకు సముచిత న్యాయం కల్పించేందుకు బీసీలకు ఆత్మగౌరవ భవనాలు ఏర్పాటు చేసి వారికి అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ఉమ్మడి పాలనలో ఏ ఒక్క కుల సంఘం అభివృద్ధి చెందలేదని, బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని కులాలను కడుపులో పెట్టుకొని వారి అభివృద్ధికి బాటలు వేశారన్నారు. వైష్ణవ భవానానికి మరో ఎకరం భూమి కోసం సీఎం కేసీఆర్తో మాట్లాడుతానని మంత్రి అన్నారు. నూతన భవనంలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు పీర్జాదిగూడ కార్పొరేషన్ నిధులు కేటాయిస్తామని తెలిపారు.
సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం: డా.కృష్ణమోహన్ రావు
తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని బీసీ కమిషన్ చైర్మన్ కృష్ణమోహన్ రావు పేర్కొన్నారు. బీసీ, ఎంబీసీ, సంచార కులాలకు ఆత్మగౌరవం పెంచింది సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ కుర్మాచలం, మేడ్చల్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ దర్గ దయాకర్రెడ్డి, చాత్తాద శ్రీవైష్ణవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశ్వాపురం వేణు మాధవ్, పరివాద కృష్ణమూర్తి, సాయి వెంకట్, సంఘం ఉపాధ్యక్షులు తులసి, నిర్మల, సంఘం సభ్యులు పాల్గొన్నారు.