సుల్తాన్బజార్, ఫిబ్రవరి 4 : అంతర్జాతీయ సహకారంతో రాష్ర్టాన్ని అత్యాధునిక విజ్ఞాన కేంద్రంగా మార్చడమే లక్ష్యమని కళాశాల సాంకేతిక విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ అన్నారు. శనివారం నాంపల్లిలోని రూసా కేంద్రంలో బ్రిటీష్ కౌన్సిల్తో తెలంగాణ ప్రభుత్వం రెసిడెన్షియల్ షార్ట్ టర్మ్ సర్టిఫికెట్ కోర్సును యూకేలో నిర్వహించేందుకు స్కాలర్షిప్ ఫర్ ఔట్ స్టాండింగ్ అండర్ గ్రాడ్యుయేట్ టాలెంట్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని ఎస్సీడీ హైదరాబాద్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో సీనియర్ ఇంటర్నేషనల్ ఆఫీసర్ డొన్నాగలీ, బ్రిటీష్ కౌన్సిల్ డైరెక్టర్, సౌత్ ఇండియా జనక పుష్పనాథన్తో కలిసి నవీన్ మిట్టల్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలోని మెరిట్ విద్యార్థులకు ఈ షార్ట్ టర్మ్ కోర్సు ఎంతో ఉపయోగం అన్నారు. యూకేలోని స్కాట్ల్యాండ్లో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గోలో మార్చి నుంచి ఏప్రిల్ వరకు 15 రోజుల పాటు నిర్వహించే ఈ షార్ట్ టర్మ్ కోర్సుకు రాష్ట్ర వ్యాప్తంగా అత్యుత్తమ ప్రతిభ కలిగిన విద్యార్థులను ఎంపిక చేసినట్లు చెప్పారు.