మహిళా జర్నలిస్టుల సదస్సు ముగింపులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
అమీర్పేట్, ఏప్రిల్ 24: ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో 18 వేల మంది జర్నలిస్టులు అక్రిడేషన్ కార్డులు కలిగి ఉన్నారన్నారు. రూ.100 కోట్లతో జర్నలిస్టుల సంక్షేమానికి టీఆర్ఎస్ సర్కార్ ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి వారి కష్ట సమయాల్లో ముందుండి ఆదుకుంటోందని వివరించారు. కొవిడ్ కష్టకాలంలో మృతి చెందిన 64 మంది జర్నలిస్టుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆర్ధిక సహాయం అందించి ఆదుకున్నామని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమానికి ఏర్పాటు చేసిన నిధి నుంచి ఇప్పటివరకు రూ.42 కోట్లను వెచ్చించినట్టు పలు వివరాలను వెల్లడించారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఆధ్వర్యంలో బేగంపేట్లోని హోటల్ హరిత ప్లాజాలో రెండు రోజులుగా జరుగుతున్న మహిళా జర్నలిస్టుల ముగింపు సదస్సు ఆదివారం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ కవిత మహిళా జర్నలిస్టులను ఉద్దేశించి మాట్లాడుతూ ఛాలెంజింగ్గా ఉండే జర్నలిస్టును వృత్తిని సమర్ధవంతంగా నిర్వహిస్తున్న మహిళలను అభినందించారు. తెలంగాణ సచివాలయ నూతన భవనంలో మహిళా జర్నలిస్టులకు ప్రత్యేకంగా గదులు ఉండేలా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువస్తానని వెల్లడించారు. మహిళలకు జర్నలిస్టులుగా అంది వచ్చిన అవకాశాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్న వారిని ప్రత్యేకంగా అభినందించారు.
ప్రతి రంగంలో మహిళలు ఇబ్బందులు పడుతున్న విషయం సాధారణమే అయినా.. ఎక్కడా మహిళలు కుంగిపోకుండా తమను తాము నిరూపించుకుంటూ పురుషులకు దీటుగా ముందుడుగు వేస్తున్న తీరు స్ఫూర్తిదాయకమన్నారు. వర్క్ ప్లేసులో వేధింపుల కట్టడికి అన్ని సంస్థల్లో మహిళల నేతృత్వంలో ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ విషయంలో ఇప్పటికే ప్రభుత్వం తన విధానాలను స్పష్టం చేసిందని గుర్తు చేశారు. ఈ ముగింపు సభలో ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, కార్పొరేటర్ సంగీతా యాదవ్, మహిళా జర్నలిస్టులు మాలిని సుబ్రహ్మణ్యం, ధన్య రాజేంద్రన్, సుమా బాల, శ్వేత, కవిత పాల్గొన్నారు.