సిటీబ్యూరో, జూన్ 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలు, సాంసృతిక సంప్రదాయాలు, జానపద వారసత్వానికి ప్రతీకగా నిలిచిన ఆషాఢ మాస బోనాల ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న మంత్రి సురేఖ బుధవారం జూమ్ వేదికగా ఎంసీఆర్హెచ్ఆర్డీలో నిర్వహించిన బోనాల ఉత్సవాల సమన్వయ సమావేశంలో పాల్గొని ఏర్పాట్లపై మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, ఇతర ఉన్నతాధికారులతో చర్చించారు.
మంత్రి సురేఖ మాట్లాడుతూ.. ఈ ఏడాది జూలై 16 నుంచి ఆగస్టు 13 వరకు హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మలాజిగిరి జిల్లాల పరిధిలోని దేవాలయాల్లో నిర్వహించే ఆషాఢ బోనాల ఉత్సవాలకు సౌకర్యాల కల్పనలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ ఏడాది బోనాల ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ.20 కోట్ల నిధులను కేటాయించిందన్నారు. ఎమ్మెల్సీలు బొగ్గారపు దయానంద్, ఎమ్మెల్యేలు నవీన్ యాదవ్, దానం నాగేందర్, డిజిపి సీవీ ఆనంద్, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, డైరక్టర్ హనుమంతరావు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, ధార్మిక సలహాదారు గోవింద హరి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.