హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): మానసిక సమస్యలతో బాధపడుతున్నవారికి అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘టెలి మానస్’ హెల్ప్లైన్ను ప్రారంభించింది. మానసిక ఒత్తిడి, కుంగుబాటు, ఆందోళనలు, ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు వంటి ఇబ్బందులు ఎదురైతే 14416 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేస్తే కౌన్సెలింగ్ ఇస్తారు. 24 గంటలపాటు ఈ హెల్ప్లైన్ పనిచేయనున్నది. హైదరాబాద్ వెంగళ్రావునగర్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ వెల్ఫేర్ ఆఫీస్లో ఏర్పాటు చేసిన ఈ కాల్ సెంటర్ను మంత్రి హరీశ్రావు మంగళవారం ప్రారంభించారు.
బాధితులకు కౌన్సెలింగ్ ఇవ్వడానికి 20 మంది సిబ్బంది అందుబాటులో ఉన్నారు. వారికి బెంగళూరులో ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. వీరికి సహాయంగా ఐదుగురు మానసిక వైద్యుల బృందం ఉంటుంది. ఈ కాల్ సెంటర్కు ఎర్రగడ్డలోని మానసిక చికిత్స కేంద్రం సాంకేతిక సాయం అందిస్తున్నది. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైద్యరంగాన్ని బలోపేతం చేసేందుకు ‘టెలి-మెంటల్ హెల్త్ సర్వీసెస్’ ఉపయోగపడుతుందని చెప్పారు. మానసిక సమస్యలతో బాధపడేవారికి ప్రాథమికంగా కౌన్సెలింగ్ ఇస్తారని, అవసరమైతే మానసిక వైద్యులకు రిఫర్ చేస్తారని తెలిపారు. ఏ క్షణమైనా కాల్ చేసి సాయం పొందవచ్చని, దవాఖానకు రావాల్సిన పనిలేదని వెల్లడించారు. బాధితుల వివరాలు పూర్తి గోప్యంగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో కుటుంబ, ఆరోగ్య సంక్షేమశాఖ కమిషనర్ శ్వేతా మహంతి, ఈఎంఈ రమేశ్రెడ్డి, టీఎస్ఎంఐడీసీ ఎండీ చంద్రశేఖర్రెడ్డి, సీఎం ఓస్డీడీ గంగాధర్, ఆరోగ్యశ్రీ సీఈవో విశాలాచ్చి తదితరులు పాల్గొన్నారు.