రక్తపోటు(బ్లడ్ప్రెషర్), మధుమేహం (షుగర్) బాధితులు త్వరగా కోలుకునేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానల్లో నమోదైన ఈ వ్యాధిగ్రస్తుల ఇంటి వద్దకే మందులు పంపించే ఏర్పాట్లు చేస్తున్నది. పైలట్ ప్రాజెక్టుగా మహబూబాబాద్లో సక్సెస్ కావడంతో త్వరలో గ్రేటర్వ్యాప్తంగా ప్రారంభించేందుకు వైద్యారోగ్యశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. మూడు రంగుల్లో మూడు పూటలా వేసుకునేలా ప్రత్యేక సంచిలో గోలీలను అందజేస్తారు. మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్లతో నగరంలో బీపీ, షుగర్ బాధితుల సంఖ్య ఏటా పెరుగుతున్నది. వయసుపైబడి కొందరు, నిర్లక్ష్యంతో మరి కొందరు మధ్యలోనే మందులు మానేస్తుండడంతో ఇతర అవయవాలు దెబ్బతిని ప్రాణాపాయస్థితికి చేరుకుంటున్నారు. గ్రేటర్లోని బస్తీ దవాఖానల్లో 80వేల మంది బీపీ, షుగర్ బాధితులు ఉన్నారు.
సిటీబ్యూరో, మే 18 (నమస్తే తెలంగాణ) : మొన్న బస్తీ దవాఖానలు….నిన్న తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లు….నేడు ఇంటి వద్దకే మందులు… నిరుపేదల ఆరోగ్యమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం వైద్యసేవలను విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు బీపీ, షుగర్ గోలీలను ఇంటి వద్దకే వచ్చి పంపిణీ చేసేందుకు కసరత్తు మొదలు పెట్టింది. ఇప్పటికే మహబూబాబాద్లో అధికారికంగా ప్రారంభించిన ప్రభుత్వం మరికొన్ని ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్ట్గా నిర్వహిస్తోంది. త్వరలోనే ఈ మందుల పంపిణీ కార్యక్రమాన్ని ఎన్సీడీ(నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్)కింద గ్రేటర్లో ప్రారంభించేందుకు వైద్య, ఆరోగ్యశాఖ సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ మందులను అన్ని ఆరోగ్య కేంద్రాలలో ఉచితంగా ఇస్తున్నారు.
అయితే ఎక్కువగా ఈ మందులను తీసుకునే వారు 50-60 ఏండ్ల పైబడినవారే కావడంతో వారు మందులు కావల్సిన ప్రతిసారి ఆరోగ్యకేంద్రాలకు వచ్చి క్యూలైన్లలో నిరీక్షించాల్సి వస్తుంది. దీని వల్ల కొంత మంది రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అంతేకాకుండా వయసురీత్యా దవాఖానకు వచ్చేందుకు వీలుకానివారు కొందరు జీవితకాలం వాడాల్సిన మందులను మధ్యలోనే ఆపేస్తున్నారు. దీనివల్ల బీపీ, షుగర్ స్థాయిలు అదుపు తప్పి గుండె, కిడ్నీ తదితర ప్రధాన అవయవాలు దెబ్బతిని ప్రాణపాయ స్థితికి చేరుకుంటున్నారు. దీనిని నివారించేందుకు రోగుల ఇంటి వద్దకే మందులను పంపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ సర్కార్.
ప్రతి ఇంటిలో బీపీ, షుగర్ బాధితులు ఉన్నప్పటికీ కొంత మందికి ఆ సమస్యలున్నట్లు తెలియదు. దీంతో సమస్య ముదిరి ప్రాణం మీదకు వచ్చిన తరువాత దవాఖానలకు పరుగులు తీయాల్సిన పరిస్థితి. ఇంటింటికి వెళ్లి మందులు ఇవ్వడంతో పాటు 30ఏళ్లు దాటిన వారు, లక్షణాలతో ఇబ్బందులు ఎదుర్కొనే వారికి ఆరోగ్య కార్యకర్తలు ఇంటి వద్దనే పరీక్షలు నిర్వహిస్తారు. సమస్య ఉన్నట్లు నిర్ధారణ జరిగితే వారిని స్థానిక ఆరోగ్య కేంద్రాలకు సిఫారసు చేస్తారు. ఈ మేరకు అక్కడి వైద్యులు రోగికి తదుపరి వైద్యపరీక్షలు జరిపించి అవసరమైన చికిత్స అందిస్తారు. వైద్యుల సూచన మేరకు ఆరోగ్య కార్యకర్తలు రోగులకు మందులను ఇంటి వద్దకే తీసుకెళ్లి ఇస్తారు.
గ్రేటర్లోని బస్తీ దవాఖానల్లోనే ఇప్పటి వరకు 80వేల మంది బీపీ, షుగర్ బాధితులను గుర్తించారు. వీరిలో 40వేల మంది బీపీ రోగులు, 30 వేల మంది షుగర్ బాధితులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరందరూ ప్రస్తుతం ఆయా ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి మందులు తీసుకుంటున్నారు. త్వరలోనే ఎన్సీడీ కార్యక్రమాన్ని గ్రేటర్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుండడంతో ఇక నుంచి వారు మందుల కోసం దవాఖానలకు వెళ్లాల్సిన పనిలేదు.
ఇంటింటికీ వెళ్లి మందులు పంపిణీ చేయాలంటే ముందుగా రోగులను గుర్తించి వారి చిరునామా తెలుసుకోవాలి. ఈ క్రమంలో ఇప్పటికే రోగుల వివరాల జాబితాను వైద్యాధికారులు సిద్ధం చేసినట్లు సమాచారం. మరికొంత మంది వివరాలను ఇంకా సేకరిస్తున్నారు. ఈ జాబితా ఆధారంగా ప్రతి రోగి వద్దకు వెళ్లి బీపీ, షుగర్ బాధితులకు అవసరమైన మందులను పంపనున్నారు. ఆశలు, ఆరోగ్య కార్యకర్తలు మందులతో కూడిన కిట్స్ను రోగులకు అందచేసేందుకు కసరత్తు మొదలు పెట్టారు ఉన్నతాధికారులు.
ఇంటి వద్దకే బీపీ, షుగర్ తదితర గోలీలను పంపిణీ చేసే క్రమంలో రోగుల సౌకర్యార్థం ప్రత్యేక రంగులతో కూడిన పౌచ్లను తయారు చేశారు. సాధారణంగా బీపీకి సంబంధించి రోజుకు ఒక పూట మాత్రమే మాత్ర వేసుకోవాల్సి ఉంటుంది. కానీ షుగర్ వ్యాధిగ్రస్తులకు ప్రస్తుతం ఉదయం, రాత్రి సమయాల్లో రెండు పూటల గోలీలను అందచేస్తున్నారు. రాబోయే రోజుల్లో ‘గ్లిఫ్టిన్’ అనే మరో మాత్రను కూడా షుగర్ వ్యాధిగ్రస్తులకు జోడించనున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని మూడు రంగుల పౌచ్తో కూడిన బ్యాగ్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఇటీవల వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ప్రకటించారు. ఏ సమయానికి ఏ మందులు వాడాలో ఆ మందులను సంబంధిత రంగు పౌచ్లో లోడ్ చేసి రోగులకు అందచేస్తారు.