సిటీబ్యూరో, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ) :వాహనదారులు క్రమశిక్షణతో డ్రైవింగ్ చేయాలని, లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దని హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేశ్ అన్నారు. ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులను సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. శనివారం జేటీసీగా బాధ్యతలు స్వీకరించిన ఆయన ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
ఆన్లైన్లో అందుబాటులో ఉన్న ఆర్టీఏ సేవలను వినియోగించుకోవాలన్నారు. సేవలు పొందడంలో వాహనదారులకు ఏవైనా ఇబ్బందులుంటే సంబంధిత ఆర్టీఏ అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. వాహనదారులు బాధ్యతగా వ్యవహరించి.. రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, మరణాలకు కారణమయ్యేలా వాహనాన్ని నడపడం వంటి ఘటనల్లో డ్రైవింగ్ లైసెన్స్లు రద్దు చేస్తున్నామని చెప్పారు. 31న ‘న్యూ ఇయర్’ పార్టీల హడావుడి ఎక్కువగా ఉంటుందని.. కచ్చితంగా వాహనదారులు నిబంధనలు పాటించాలన్నారు.