సిటీబ్యూరో, జనవరి 4 (నమస్తే తెలంగాణ) : కాలుష్య నియంత్రణలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని రెడో చైర్మన్ వై.సతీశ్ రెడ్డి అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో రెడో (రెన్యూయెబుల్ ఎనర్జీ డెవలప్ మెంట్ కార్పొరేషన్) ఏర్పాటు చేస్తున్న ఫాస్ట్ చార్జింగ్ కేంద్రాలను మంగళవారం ఆయన పరిశీలించారు. హైదరాబాద్ దుర్గం చెరువు దగ్గర ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ వాహన చార్జింగ్ మెషిన్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగేలా మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్తో పాటు.. రాష్ట్ర వ్యాప్తంగా చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చార్జింగ్ మెషిన్ల ఇన్స్టాలేషన్ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
చార్జింగ్ కేంద్రాల్లో వాహనాల పారింగ్, వాహన యాజమానులు సేదదీరేందుకు వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో అతి త్వరలో 150 ఎలక్ట్రిక్ వాహన చార్జింగ్ కేంద్రాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. వాహనదారుల సమయం వృథా కాకుండా.. కేవలం 30 నుంచి 45 నిమిషాల్లో కారు చార్జింగ్ పూర్తవుతుందన్నారు. చార్జింగ్ కేంద్రాల ఏర్పాటులో భాగంగా దేశంలోనే సేవా రుసుమును ముందుగా నిర్ణయించిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. ఇందుకు సహకరించిన ముఖ్యమంత్రి కేసీఆర్, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కేటీఆర్, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడో ఎలక్ట్రిక్ వాహన విభాగం ప్రాజెక్ట్ డైరెక్టర్ రామకృష్ణ, అనిల్ పాల్గొన్నారు.