మాదాపూర్ హైటెక్స్లో ఈవీ వాహనాలన్నీ ఠీవీగా కొలువుదీరాయి. తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహంతో బుధవారం హైదరాబాద్ ‘ఈ మోటార్’ షో అట్టహాసంగా ప్రారంభమైంది. మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ షోను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. పర్యావరణహితమే లక్ష్యంగా దేశీయ, విదేశీ కంపెనీలు రూపొందించిన వాహనాలను 40 స్టాళ్లలో ప్రదర్శనకు ఉంచారు. ఎలక్ట్రిక్ వాహనాలపై కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో సరికొత్త ఫీచర్లతో టూ వీలర్, త్రీ వీలర్, ఫోర్ వీలర్ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. చూడముచ్చటైన వాహనాలను చూసేందుకు రైడర్స్ పెద్ద ఎత్తున షోకు తరలివచ్చారు. వాహనాల వివరాలు, ధరలను అడిగి తెలుసుకున్నారు. మరో రెండు రోజులపాటు ఈ మోటార్ వాహనాలు కనువిందు చేయనున్నాయి. ఇదిలా ఉంటే ఈ మోటార్ షోలో రేసింగ్ సిమ్యులేటర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీని ద్వారా సందర్శకులు రేస్ కార్లను నడిపిన అనుభూతి పొందారు.
సిటీబ్యూరో, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ) : ‘ఈవీ రంగానికి ఊతమిచ్చేలా తెలంగాణ ప్రభుత్వం మాదాపూర్ హైటెక్స్ వేదికగా నిర్వహిస్తున్న హైదరాబాద్ ‘ఈ మోటార్’ షో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ నెల 8 నుంచి 10 వరకు మూడు రోజులపాటు నిర్వహిస్తున్న ఈ షోను బుధవారం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఎలక్ట్రిక్ వాహనాల పట్ల కొనుగోలుదారులు సైతం ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో చాలా సంస్థలు సరికొత్త ఫ్యూచర్లతో టూ వీలర్, త్రీ వీలర్, ఫోర్ వీలర్ వాహనాలను రూపొందిస్తున్నాయి. ఈ క్రమంలోనే హైటెక్స్లో ఏర్పాటు చేసిన 40 స్టాల్స్లో ఆయా కంపెనీలు వాహనాలను ప్రదర్శనకు పెట్టాయి. చూడముచ్చటైన వాహనాలను చూసేందుకు రైడర్స్ సైతం పెద్ద ఎత్తున షోకు తరలివచ్చారు. దేశీయ కంపెనీలు తయారు చేసిన వాహనాలు విదేశీయ కంపెనీల వాహనాలతో ఈ షోలో పోటీపడ్డాయి.
700కిలోల బరువును సైతం అలవోకగ తరలించేలా..
భారత మార్కెట్కు, దేశీయ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఈటో కంపెనీ ఎలక్ట్రిక్ ఆటోను రూపొందించింది. మూడు గంటలపాటు ఛార్జ్ చేస్తే వంద కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. గంటకు 43కి.మీ.ల వేగంతో ప్రయాణించే ఈ ఆటోలో 700కిలోల బరువును సునాయసంగా తరలించవచ్చని కంపెనీ చెబుతున్నది. కాగా, ఈటో ఆటోల తయారీ కేంద్రం జడ్చర్లలో ఉంది. హైదరాబాద్ మియాపూర్లో హబ్ ఉండగా..మాదాపూర్, అంబర్పేట్, నాగోల్, సికింద్రాబాద్లలో ఈటో కంపెనీకి బ్రాంచీలు ఉన్నాయి. ఆటో ధర రూ.4లక్షలు. మహిళలు నడిపేందుకు అనువుగా ఉండడంతో విక్రయాల్లో వారికే ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు.
4 గంటల చార్జింగ్తో 100 కిలోమీటర్లు..
వాసవి కంపెనీ 4 + 1 సీటింగ్ కెపాసిటీతో కొత్త ఫ్యూచర్స్తో ఆటోను మార్కెట్లోకి తెచ్చింది. నాలుగు గంటలు చార్జింగ్ చేస్తే చాలు..వంద కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చు. గత పదిహేనేళ్ల నుంచే వాసవి కంపెనీ టూ వీలర్, త్రీవీలర్తోపాటు నాలుగు చక్రాల ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. చాలా ఏళ్లక్రితం నుంచే ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లోనూ వాసవి కంపెనీ తయారుచేసిన వాహనాలు రోడ్లపై తిరిగాయి. రోడ్లపై ఎలక్ట్రిక్ వాహనాలు తిరిగేందుకు ఇన్నాళ్లు అనుమతులు లేక హైదరాబాద్, వైజాగ్, తిరుపతి వంటి ప్రాంతాల్లోని జూపార్క్లలో ఈ వాహనాలనే వినియోగిస్తున్నారు. తాజాగ..సోనీ కంపెనీ పేరుతో సరికొత్త మోడల్లో ఆటోను కంపెనీ నిర్వాహకులు అందుబాటులోకి తెచ్చారు. ఐదుగురు ప్రయాణించేలా సీటింగ్ కెపాసిటీతో దీన్ని రూపొందించారు. గంటకు 35కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ వాహనం ఖరీదు రూ.1.50లక్షలు. వాసవి కంపెనీకి లక్డీకపూల్, తిరుమలగిరిలలో బ్రాంచీలు ఉన్నాయి.
రివర్స్మోడ్లోనూ రైడింగ్ చేయొచ్చు..
జైపూర్ దిగ్గజ సంస్థ హెచ్వోపీ ఎలక్ట్రిక్ మొబిలిటీ తాజాగా ఆక్సో మోటర్ సైకిల్స్ సిరీస్లో కొత్త శ్రేణిని మార్కెట్లోకి తెచ్చింది. అత్యాధునిక ఫీచర్లతో మూడు బైక్లను మార్కెట్లోకి తెచ్చింది. మంత్రి కేటీఆర్ ఈ బైక్ను ఆవిష్కరించారు. దీనిపై గంటకు 90 నుంచి 150 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. నాలుగు గంటల పాటు ఛార్జింగ్ చేస్తే 135కిలోమీటర్ల వరకు బైక్ నడుస్తుంది. వీటి ధరలు రూ.1.50లక్షల నుంచి రూ.1.80 లక్షల వరకు అందుబాటులో ఉన్నాయి. ఎకో-పవర్-స్పోర్ట్, రివర్స్ మోడ్ వంటివి మాడల్స్ ఉన్నాయి. ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా న్యావిగేషన్తోపాటు అనేక సదుపాయాలను కల్పించినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. 4జీ కనెక్టివిటీతో సెక్యూరిటీ ఫీచర్ల కల్పనకు 5 అంగుళాల స్మార్ట్ ఎల్సీడీ డిస్ప్లే కూడా ఉంది. మొబైల్ యాప్లో ముందుగానే ఎంపిక చేసుకుని లో స్పీడ్, టర్బో స్పీడ్ మోడ్లో ప్రయాణించేలా దీన్ని రూపొందించారు. హిమాయత్ నగర్, ఉప్పల్, కర్మాన్ఘాట్, మలక్ పేట్, కొంపల్లి, కూకట్పల్లి, మేడ్చల్లలో హెచ్వోపీకి బ్రాంచీలు ఉన్నాయి. ట్విలైట్ గ్రే, కాండీ రెడ్, మాగ్నెటిక్ బ్లూ, ఎలక్ట్రిక్ ఎల్లో, ట్రూ బ్లాక్ కలర్స్లో కంపెనీ బైక్లను అందుబాటులో ఉంచింది.
రిమోట్తోనూ స్టార్ట్ చేసేలా..
వేద మోటార్స్ లైట్ వెయిట్తో రూపొందించిన స్కూటీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. లిథియం, లెడ్ యాసిడ్తో నడిచేలా స్కూటీలను తయారు చేశారు. నాలుగు నుంచి ఏడు గంటలపాటు ఛార్జ్ చేస్తే 60కి.మీ.ల వరకు ప్రయాణించవచ్చు. స్కూటీల ధరలు రూ.71వేలు మొదలుకుని రూ.98వేల వరకు ఉన్నాయి. గుంటూరు వేదికగా వేద మోటార్స్ పదిహేనేళ్లుగా ఈ వాహనాలను సరికొత్త ఫ్యూచర్లతో విడుదల చేస్తూ వస్తున్నది. రిమోట్తోనూ ఈ స్కూటీని స్టార్ట్ చేయవచ్చు. అలాగే..కారు మాదిరిగానే..ఎవరైనా స్కూటీని టచ్ చేస్తే అలర్ట్ చేసేందుకు సౌండ్ కూడా వస్తుంది. రిజిస్ట్రేషన్తోపాటు లైసెన్స్ వంటి షరతులు ఈ వాహనాలకు వర్తించవని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. వాహనం తేలికగా ఉండేలా రూపొందించామని, కొత్తగా డ్రైవింగ్ చేసే వారికి సౌకర్యవంతంగా ఉంటుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.
బ్రాండ్ అంబాసిడర్గా వచ్చా
మాది దమ్మాయిగూడలోని బాలాజీ నగర్. గతంలో ఎల్పీజీ కంపెనీలో ఆటో నడిపేదాన్ని. మూడేళ్లక్రితం ఈటో కంపెనీలో బ్రాండ్ అంబాసిడర్గా చేరాను. కంపెనీ తరపున ఈటో కంపెనీ ఆటోలకు సంబంధించి ప్రచారం చేస్తున్నా. హైటెక్స్లో జరుగుతున్న ఈ మోటార్ షో గురించి తెలుసుకుని బ్రాండ్ అంబాసిడర్గా వచ్చాను. ఈటో ఆటోలను చూసి చాలామంది ముగ్ధులవుతున్నారు. ప్రత్యేకించి మహిళల కోసం తయారు చేయగా..వారి నుంచి సైతం స్పందన బాగుంది.
– జి.మీన, బాలాజీ నగర్
40 స్టాల్స్లో ప్రదర్శనలు
కాలుష్య రహితంగా రూపొందించిన దేశీ, విదేశీ కంపెనీలకు చెందిన వాహనాలను 40 స్టాల్స్లో ప్రదర్శించారు. ప్రదర్శనగా ఉంచారు. సరికొత్తగా లిథియం-ఆయాన్ బ్యాటరీలు, ఛార్జింగ్ సొల్యూషన్స్, వాహప విడి భాగాలను సైతం ఇందులో ప్రదర్శించారు. రైడర్స్ సైతం పెద్ద ఎత్తున షోకు తరలిరాగా ప్రతి ఒక్కరినీ ఈ షో అలరించింది. కొనుగోలుదారులు సైతం సరికొత్త ఫ్యూచర్లతో ఆవిష్కరించిన వాహనాలను చూసి మురిసిపోయారు. మరో రెండు రోజులపాటు ఈ మోటార్ వాహనాలు కనువిందు చేయనున్నాయి.
తొలి ఎలక్ట్రిక్ వెహికిల్ మా కంపెనీదే
సాధారణ ప్రజానీకానికి సైతం ఉపయోగపడేలా వాసవి కంపెనీ ఆధ్వర్యంలో ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లో తెచ్చాం. ఇండియాలోనే మొదటిసారిగా ఎలక్ట్రిక్ వాహనాన్ని మార్కెట్లోకి తెచ్చింది మా కంపెనీయే. టూ వీలర్తో మొదలుపెట్టి నాలుగు చక్రాల వాహనాలను వాసవి కంపెనీ ఆధ్వర్యంలో రూపొందించాం. మా కంపెనీకి చెందిన వాహనాలు ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లోనూ తిరుగుతున్నాయి. గుడుంబా తయారీని మానివేసిన కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.2లక్షల విలువజేసే వాహనాలను అందజేయగా..మా కంపెనీ వాహనాలనే కొనుగోలు చేయడం మాకు గర్వకారణం.
– వెంకటేశం గుప్తా
ప్రత్యేక ఆకర్షణగా రేసింగ్ సిమ్యులేటర్
ఈ మోటార్ షోలో రేసింగ్ సిమ్యులేటర్ ప్రత్యేక ఆకర్శణగా నిలిచింది. అంతర్జాతీయ రేసింగ్ పోటీలు నగరంలో జరుగుతుండటంతో రేస్ కార్లను నడిపిన అనుభూతిని సందర్శకులకు అందించేందుకు మహీంద్ర ఈ సిమ్యులేటర్ సేవలను హైదరాబాద్ ఈ-మొబిలిటీ వీక్లో భాగంగా హైటైక్స్లో జరగుతున్న ఈ మోటార్ షోలో ప్రారంభించింది. బ్రేక్, ఎస్క్లేటర్, స్టీరింగ్, డిస్ప్లే సాయంతో రేసింగ్లో పాల్గొనొచ్చు. అచ్చం రేసింగ్ రోడ్డు ట్రాక్ మీదనే నడుపుతున్నట్టుగా సందర్శకులు అనుభూతికి లోనవుతారు. చుట్టూ గోడలు.. మధ్యన రోడ్డు.. దానిపై కొన్ని సింబల్స్ వాటికి అనుగుణంగా రేసింగ్ కారు నడుపుతుంటే సజావుగా సాగితే పాయింట్లు జత అవుతుంటాయి. గోడలకు ఢీకొట్టిన సందర్భంలోనూ పాయింట్లు డిస్ప్లే అవుతుంటాయి. ఇలా రేసింగ్ కారును డ్రైవ్ చేయాలనే ఆశను చాలా మంది నెరవేర్చుకున్నారు. మహీంద్ర ఎక్స్యూవీ-400 మోడల్. మహీంద్ర నుంచి ఇది మూడో ఎలక్ట్రిక్ కారు. దీని ధర రూ.20.43 లక్షలు. ఒక్కసారి ఛార్జీ చేస్తే 456 కిలో మీటర్ల దూరం వరకు ప్రయాణం చేస్తుంది. ఇందులో అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. 7.2 ఔట్లెట్ ఛార్జర్ ఉంటుంది. ఈ కారు ఈవీ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్శణగా ఉంది. టెస్ట్ డ్రైవ్ కూడా ఇస్తున్నారు.