సిటీబ్యూరో, జూన్ 2 (నమస్తే తెలంగాణ): కలబడి, నిలబడి, పోరాడి సాధించుకున్న తెలంగాణ పదో వసంతంలోకి అడుగుపెట్టింది. శుక్రవారం గ్రేటర్వ్యాప్తంగా ఆవిర్భావ సంబురాలు అంబరాన్నంటాయి. 21 రోజుల పాటు జరిగే దశాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గ్రేటర్వ్యాప్తంగా అన్ని కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ప్రగతి భవన్, కొత్త సచివాలయంలో సీఎం కేసీఆర్, మేడ్చల్ కలెక్టరేట్లో మంత్రి మల్లారెడ్డి, రంగారెడ్డి కలెక్టరేట్లో సబితా ఇంద్రారెడ్డి, వివిధ నియోజకవర్గాల్లో ఆయా ప్రజాప్రతినిధులు మువ్వన్నెల జెండాలను ఎగురవేసి.. అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు.
తెలంగాణ పదో వసంతంలోకి అడుగిడిన వేళ.. గ్రేటర్వ్యాప్తంగా పదేండ్ల పండుగను శుక్రవారం కన్నుల పండువగా జరుపుకున్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రగతి భవన్లో జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్ నేరుగా గన్పార్కులోని అమరవీరుల స్థూపం వద్దకు చేరుకుని అమరుల త్యాగాలను స్మరిస్తూ నివాళులర్పించారు. అనంతరం నూతన సచివాలయంలో దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొని తెలంగాణ మోడల్గా కీర్తి ప్రతిష్టలందుకుంటున్న జనపాలన గురించి సందేశం ఇచ్చారు. ఇదిలా ఉంటే నగరంలో ఉన్న అన్ని విభాగాల కార్యాలయాల్లో ఆయా శాఖల అధిపతులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
పరిపాలన
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం తెలంగాణ దశాబ్ది వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పోలీసుల వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజల ముంగిట్లో పరిపాలన అందించాలని మంత్రి కేటీఆర్ ఆలోచన మేరకు వార్డు ఆఫీసుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ఎస్ఆర్డీపీ ద్వారా ఇప్పటి వరకు రూ.33,248.53కోట్ల వ్యయంతో 35 ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. లింకు రోడ్లు, మోడల్ గ్రేవ్యార్డులు, మల్టీపర్పస్ ఫంక్షన్హాల్స్, మోడల్ కారిడార్స్, పాదాచారుల వంతెనలు, ఎన్ఎన్డీపీ, చెరువుల సుందరీకరణ, బస్తీ దవాఖానలు, క్రీడాభివృద్ధి, అర్బన్ బయోడైవర్శిటీ తదితర మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేసినట్లు మేయర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేశ్కుమార్, ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్రెడ్డి, అడిషనల్ కమిషనర్ ప్రియాంక అలా, ఈఎన్సీ జియావుద్దీన్, ప్రాజెక్టు సీఈ దేవానంద్, అడిషనల్ కమిషనర్లు సరోజ, విజయలక్ష్మి, జయరాజ్ కెనెడీ, యాదగిరి రావు, సీసీపీ దేవేందర్రెడ్డి, అడిషనల్ సీసీపీ శ్రీనివాస్, హౌజింగ్ ఎస్ఈ విద్యాసాగర్, ప్రాజెక్టు ఎస్ఈ వెంకట రమణ, రవీంద్ర రాజు తదితరులు పాల్గొన్నారు.
టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్
తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీది కీలక పాత్రని టీఎస్ఆర్టీసీ ఎండీ, వీసీ సజ్జనార్ అన్నారు. హైదరాబాద్లోని బస్ భవన్ ప్రాంగణంలో శుక్రవారం తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో ఆయన జాతీయ జెండాను ఆవిషరించారు. అమరవీరులకు నివాళులర్పించి, టీఎస్ఆర్టీసీ భద్రతా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులు 29 రోజులు సకల జనుల సమ్మెను కొనసాగించారన్నారు. గత 9 ఏండ్లలో టీఎస్ఆర్టీసీలో అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్ సింగ్జీ పాటిల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, కృష్ణకాంత్, సీఎంఈ రఘునాథరావు, చీఫ్ మేనేజర్ ప్రాజెక్ట్స్ విజయ్కుమార్, సీటీఎం జీవన్ప్రసాద్, సీఈఐటీ రాజశేఖర్, సీఎఫ్ఎం విజయపుష్ప, బిజినెస్ హెడ్ సంతోష్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తాగునీటికి వందేండ్ల భరోసా
హైదరాబాద్ నగర ప్రజలకు వందేండ్లకు సరిపడా నీటి నిల్వకు భారీ రిజర్వాయర్లను నిర్మించి సీఎం కేసీఆర్ భరోసా కల్పించారని జలమండలి ఎండీ దానకిశోర్ పేర్కొన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఖైరతాబాద్ సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. జలమండలి వినియోగదారులకు, ఉద్యోగులకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నగరంలో రోజూ ఉత్పన్నమయ్యే మురుగునీటిని 100శాతం శుద్ధి చేయడానికి ఎస్టీపీలను నిర్మిస్తున్నట్లు ఎండీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈడీ డాక్టర్ ఎం. సత్యనారాయణ, ఈఎన్సీ అజ్మీరా కృష్ణ, ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్బాబు, డైరెక్టర్లు వీఎల్ ప్రవీణ్కుమార్, స్వామి, రవికుమార్ సీజీఎం, జీఎంలు పాల్గొన్నారు.