సిటీబ్యూరో, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాదణ): గతంలో సైబరాబాద్ పోలీసు కమిషనర్లుగా పనిచేసిన అధికారులంతా అంకితభావంతో, ప్రజలతో మమేకమై సమర్థవంతమైన సేవలు అందించి సైబరాబాద్ కమిషనరేట్కు విశిష్ట స్థానాన్ని తీసుకువచ్చారని డీజీపీ శివధర్రెడ్డి అన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ 24వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురసరించుకుని గురువారం టీ-హబ్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్మారక కార్యక్రమానికి డీజీపీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా డీజీపీ శివధర్రెడ్డి మాట్లాడుతూ గతంలో ఇక్కడ పనిచేసిన సీపీల పనితీరు వల్లనే సైబరాబాద్ కమిషనరేట్కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని, మాజీ డీజీపీ డా. మహేందర్ రెడ్డి చేతుల మీదుగా 2003 మెట్రోపాలిటన్ చట్టం కింద సైబరాబాద్ కమిషనరేట్ ఏర్పాటుతో ఆధునిక పోలీసింగ్కు బలమైన పునాది పడిందని గుర్తుచేశారు. 23ఏళ్ల ఆధునిక పోలీసింగ్కు సైబరాబాద్ కమిషనరేట్ ప్రతీకగా నిలిచిందన్నారు.
మాజీ కమిషనర్లు మాట్లాడుతూ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగర అవసరాలకు అనుగుణంగా సాంకేతిక ఆధారిత ఆధునిక పోలీసింగ్ అమలు చేయడం ద్వారా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ప్రత్యేక గుర్తింపు సాధించిందని తెలిపారు. ప్రజలతో సాన్నిహిత్యం, పారదర్శకత, వేగవంతమైన సేవలే సమర్థ పోలీసింగ్కు బలమన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేశ్ మాట్లాడుతూ ఐటీ కేంద్రంగా అభివృద్ధి చెందిన సైబరాబాద్ ప్రాంతంలో పరిశ్రమలతో సమన్వయం, సైబర్ భద్రత బలోపేతం, సాంకేతిక వినియోగం ద్వారా ప్రజా సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
అనంతరం సైబరాబాద్ పోలీస్ చరిత్ర, ముఖ్య విజయాలు, ప్రాధాన్య కార్యక్రమాలను ప్రతిబింబించే ప్రత్యేక ైస్లెడ్ షోను ప్రదర్శించారు. తరువాత సైబరాబాద్ కమిషనర్లుగా గతంలో పనిచేసిన అధికారులు, మాజీ అధికారులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ డీజీపీ డా. ఎం. మహేందర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ద్వారకా తిరుమలరావు, స్పెషల్ హోం సెక్రటరీ సీవీ ఆనంద్, నవీన్ చంద్ర, సందీప్ శాండిల్యా తదితరులు పాల్గొన్నారు.