సంక్షేమ పథకాల అమలులో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరో పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రైతు బంధు తరహాలో ప్రతి దళిత కుటుంబానికి ప్రత్యక్షంగా మేలు చేసేలా దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. తొలుత హుజూరాబాద్లో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని నిర్ణయించినా.. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. దీంతో గ్రేటర్ వ్యాప్తంగా దళిత నేతలు సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని హర్షిస్తున్నారు. దళిత బంధువుగా కొనియాడుతున్నారు. ఎల్లకాలం గుర్తించుకొని అండగా నిలుస్తామని పేర్కొంటున్నారు.
అన్ని వర్గాలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి.. దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ప్రభుత్వం..దళితుల కష్టాలను తీర్చి.. వారి జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకొచ్చేందుకు
దళిత బంధు పథకాన్ని అమలు చేయనున్నది. దళితులఅభ్యున్నతికి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్కు అభినందనలు వెల్లువెత్తున్నాయి. అభిమానంతో పలువురు ఆయన చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేస్తున్నారు. ఇది గొప్ప పథకమంటూ.. కితాబిస్తున్నారు. విప్లవాత్మకమైన పథకాన్ని తీసుకువచ్చిన ముఖ్యమంత్రికి రుణపడి ఉంటామని దళిత సంఘాలు తమఆనందాన్ని వ్యక్తంచేస్తున్నాయి.
దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం. అన్ని విధాలుగా వెనుకబాటులో ఉన్న దళితుల అభ్యున్నతి కోసం ఆయన చేస్తున్న కృషికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంతటి సాహసోపేతమైన నిర్ణయాన్ని కేసీఆర్ మినహా.. ఏ ముఖ్యమంత్రీ తీసుకోలేదు. మొదటి నుంచి దళితుల అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వంపై మాకు సంపూర్ణ విశ్వాసం ఉన్నది. సర్కారు కల్పిస్తున్న పథకాలను దళితులు సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలి. -సాద బాలయ్య, దళిత నేత
దళితులను సమున్నతంగా చూడాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం. అందుకే తెలంగాణ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ పథకాన్ని అమలు చేస్తామనడం ఆనందంగా ఉంది. అర్హులైన కుటుంబానికి రూ.10 లక్షలు అందజేస్తే దళితుల అభ్యున్నతికి ఎంతగానో ఉపయోగపడటం ఖాయం. ఇక భవిష్యత్లో రాష్ట్రంలో పేద, ధనిక అన్న తారతమ్యాలు లేకుండా పోతాయి. -సుజాత, కొండాపూర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన దళిత బంధు పథకం ఎస్సీ కుటుంబాల్లో వెలుగును తీసుకువస్తుంది. ప్రభుత్వం అందజేసే సాయంతో ఆర్థికంగా ఎదుగవచ్చు. ఎస్సీలపై ఉన్న చిత్తశుద్ధిని సీఎం కేసీఆర్ మరోసారి నిరూపించుకున్నారు. త్వరలోనే ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని కోరుతున్నా. – గంగం శివశంకర్, ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ జిల్లా అధ్యక్షుడు
అన్ని వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారు. ముఖ్యంగా దళితుల జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు దళిత బంధు పథకం ద్వారా పది లక్షలు ఇస్తామనడం అభినందనీయం. దేశ చరిత్రలోనే అత్యుత్తమ పథకాన్ని ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ను దళితులు జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. – వెంకటేశ్, కుషాయిగూడ అరుంధతి
సంక్షేమ సంఘం అధ్యక్షుడు
దళితుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తుండటం హర్షనీయం. దళితుల సంక్షేమానికి ఇప్పటివరకు ఏ ప్రభుత్వం ప్రకటించని విధంగా దళిత బంధును సీఎం కేసీఆర్ ప్రకటించారు. దళితులు ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు పది లక్షలు ఇవ్వడం అభినందనీయం. – డి.గిరిబాబు, చర్లపల్లి దళిత సంఘం నాయకుడు
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం దళితులకు వెన్నుదన్నుగా నిలువడం ఖాయం. సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా దళితుల కోసం సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టడం ఆనందంగా ఉంది. దళిత బంధు దేశ చరిత్రలోనే నిలిచిపోతుంది. -శైలజా హరినాథ్, మేడ్చల్ మాజీ జడ్పీటీసీ
ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులకు నేరుగా మేలు చేయాలనే సంకల్పంతో దళితబంధు పథకాన్ని తీసుకువచ్చారు. ఇది ఎంతో మంచి పథకం. ఈ పథకంతో దళితుల జీవితాల్లో మార్పులు రావడం ఖాయం. గతంలో దళితుల కోసం అమలు చేసిన పథకాలకు బ్యాంకులతో లింక్ పెట్టడంతో పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదు. దళిత బంధును సాధ్యమైనంత త్వరగా అమలు చేయాలని కోరుతున్నా. – మైసయ్య, నాగోల్ మాజీ సర్పంచ్
దళిత బంధు పథకంతో దళితుల్లో అసమానతలు తొలిగిపోతాయి. దళితుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ప్రతిష్ఠాత్మక ఈ పథకంతో ప్రతి దళిత బిడ్డ ఆర్థికంగా, సామాజికంగా ఎదగడం ఖాయం. -గండి రాంచందర్, జవహర్నగర్ కార్పొరేటర్
దళితులు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు దళిత బంధు పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. దళిత సాధికారత కోసం సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారు. దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ పథకం అద్భుతంగా ఉంది. – నిమ్మల రాఘవేందర్, చర్లపల్లి
దళితుల వెనుకబాటుతనాన్ని పోగొట్టేందుకే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పటికే అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న ఆయన దళితులను గుర్తించి వారి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తుండటం అభినందనీయం. దళితుల కోసం ప్రత్యేక పథకం అమలుకు నిర్ణయించిన సీఎం కేసీఆర్ను జీవితాంతం గుర్తు పెట్టుకుంటాం. దళిత బంధు పథకాన్ని అందరికి అందేలా సంఘం తరుపున కృషి చేస్తా. -గుడ్ల శ్రీనివాస్, టీఎంఆర్పీఎస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు
దళితుల జీవితాలను మార్చేందుకు సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం అమలుకు ప్రతి సంవత్సరం రూ.1000 కోట్లు కేటాయించడం అభినందనీయం. గ్రామం యూనిట్గా ప్రతి సంవత్సరం 8 లక్షల కుటుంబాలకు న్యాయం చేయాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నేరుగా నగదును వారి ఖాతాల్లో వేస్తుండటంతో దళితుల కుటుంబాల్లో వెలుగులు ప్రసరించడం తథ్యం. – వేముల చిన్న, రామంతాపూర్
దళిత బంధు పథకం అమలుతో దళితులు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్లడం ఖాయం. వెనుకబాటుతో పాటు కుల వివక్షకు గురవుతున్న దళితులకు ఆర్థిక సాయంతో పాటు రక్షణ నిధిని ఏర్పాటు చేయడం అదృష్టంగా భావిస్తున్నా. ఎన్ని ప్రభుత్వాలు మారినా దళితులకు చేసింది శూన్యం. దళితుల తరతరాల తలరాతను మార్చేందుకు సీఎం కేసీఆర్ కంకణం కట్టుకోవడం ఆనందంగా ఉంది. దళితులకు అన్ని రంగాల్లో అవకాశం కల్పిస్తున్న సీఎం కేసీఆర్ను ఎన్నటికీ మరిచిపోం. -బద్దం కుమార్, ప్రతాపసింగారం
దళితుల అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రభుత్వం తెచ్చిన దళిత బంధు పథకాన్ని స్వాగతిస్తున్నాం. ప్రభుత్వ నిర్ణయంతో దళితులు ఎంతో సంతోషంగా ఉన్నారు. రాష్ట్రంలోని దళితులపై సీఎం కేసీఆర్కు ఉన్న ప్రేమకు ఇదే నిదర్శనం. ఎలాంటి అవకతవకలకు అస్కారం లేకుండా పథకాన్ని అమలు చేయాలని కోరుతున్నా. -రెడపాక వెంకట్, రామంతాపూర్