హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రపంచ దేశాలలో ఎంతో గౌరవం, ప్రత్యేక గుర్తింపు ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి లండన్ పర్యటనలో ఉన్న మంత్రి తలసాని అక్కడి తెలుగు ప్రజలు ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
బోనాల పండుగకు సంబంధించిన బ్రోచర్ ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాలు, ప్రకృతిని పూజించే బతుకమ్మ పండుగలను నేడు అనేక దేశాలలో నిర్వహించడం తెలుగు ప్రజలుగా మనకెంతో గర్వకారణం అన్నారు. దేశంలోనే గొప్ప పాలనను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని ఆయన పేర్కొన్నారు.
పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ రాష్ట్రం సురక్షితమని భావించి అనేక సంస్థలు, కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయని అన్నారు. తెలుగు వారిగా మనం ఎక్కడ ఉన్నా మన మూలాలను మరిచిపోవద్దన్నారు.