హైదరాబాద్/ సిటీబ్యూరో,ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ) ;నగరం నడిబొడ్డున సాగరతీరంలో ఆకాశమంత అద్భుతం ఆవిష్కృతమైంది. సామాజిక సమానత్వ స్ఫూర్తిని నింపుతూ.. జగమంతా కీర్తించేలా కన్నుల పండువగా శుక్రవారం విశ్వమానవ విజ్ఞానమూర్తి విగ్రహావిష్కరణ జరిగింది. అంబేద్కర్ జయంతి రోజునే దేశంలోని మొట్టమొదటి భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్, అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్ ఆవిష్కరించారు. ఈ చారిత్రక సువర్ణాధ్యాయంలో భాగమయ్యేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన జన ప్రవాహంతో సాగరతీరం నీలి వర్ణ శోభితమైంది. 125 అడుగుల అంబేద్కరుడి సమున్నత స్వరూపాన్ని చూసి సబ్బండవర్ణాల హృదయాలు ఉప్పొంగాయి. బాబాసాహెబ్ ఆశయాలకు అసలైన నివాళి ఇదే అంటూ జనమంతా జయజయ ధ్వానాలు పలుకుతూ చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. అక్కడే సెల్ఫీలు, ఫొటోలు దిగి తమ జీవితంలో మధుర జ్ఞాపకంగా మలుచుకున్నారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణకు వచ్చిన అభిమానులకు హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులు నీళ్లు, మజ్జిగ అందించారు. ఎక్కడ ఇబ్బంది లేకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమం జరుగుతున్నంత సేపు జైభీమ్, జై కేసీఆర్ నినాదాలతో సభా ప్రాంగణ పరిసరాలు దద్ధరిల్లాయి. సామాజిక మాధ్యమాల్లోనూ అంబేద్కర్ విగ్రహ చిత్రాలు, జ్ఞాపకాలతో పోస్టులు చక్కర్లు కొట్టాయి.
సాగర తీరాన అద్భుతం ఆవిష్కృతమైంది. వందల ఏండ్ల వలస పాలనలో కునారిల్లిన దేశాన్నితన అద్భుతమైన మేధాశక్తితో మహోన్నతమైన రాజ్యాంగాన్ని రచించి దేశాభివృద్ధికి పాటుపడిన జ్ఞాన శిఖరం, ప్రపంచ మేధావి డా.బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్, అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ యశ్వంత్ అంబేద్కర్ శుక్రవారం దేశంలోనే అత్యంత ఎత్తయిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ అద్భుత ఘట్టానికి హైదరాబాద్ హుస్సేన్సాగర తీరం వేదికైంది. విగ్రహావిష్కరణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్కు ప్రత్యేకంగా నివాళులు అర్పించింది. హెలికాప్టర్ ద్వారా అంబేద్కర్ విగ్రహంపై పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పిడికిలి బిగించి జై భీమ్ అంటూ నినదించారు. విగ్రహావిష్కరణ సందర్భంగా బౌద్ధ గురువులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ప్రకాశ్ అంబేద్కర్తో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ రిబ్బన్కత్తిరించి విగ్రహాన్ని ప్రారంభించారు. మహా విగ్రహం పాదాల చెంత సీఎం కేసీఆర్, ప్రకాశ్ అంబేద్కర్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర మంత్రులు, అధికారులు, దళిత సంఘాల ప్రతినిధులు పుష్పాంజలి ఘటించారు. అనంతరం విగ్రహ నిర్మాణంపై రూపొందించిన డాక్యుమెంటరీని, అంబేద్కర్ జీవిత విశేషాలతో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను సీఎం కేసీఆర్, ప్రకాశ్ అంబేద్కర్ సహా ముఖ్యనేతలు తిలకించారు.