Hyderabad Metro | సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 31 (నమస్తే తెలంగాణ) : విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ మహానగరంలో మరిన్ని అంతర్జాతీయస్థాయి మౌలిక వసతులకు తెలంగాణ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఇప్పటికే భారీ ఎత్తున ఫ్లైఓవర్లు, ఆర్వోబీ, ఆర్యూబీలతో రహదారుల వ్యవస్థను బలోపేతం చేస్తున్న ప్రభుత్వం.. అదేరీతిన ప్రజా రవాణాను ఊహించనిరీతిలో మెరుగుపరిచేందుకు నిర్ణయించింది. సోమవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఏకంగా రూ.69,100 కోట్ల అంచనా విలువతో మెట్రో విస్తరణ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం 69 కిలోమీటర్ల మేర అందుబాటులో ఉన్న మెట్రో రైలుకు టెండర్ల దశలో ఉన్న ఎయిర్పోర్ట్ మెట్రో కలిపితే 105 కిలోమీటర్లకు చేరుకోనుంది. తాజాగా కేబినెట్ ఆమోదంతో నగరం నలువైపులా విస్తరించి 415 కిలోమీటర్ల పొడవుతో దేశంలోనే అతిపెద్ద మెట్రో గుర్తింపు సాధించనుంది. నాగపూర్ తరహాలో రెండు ఎలివేటెడ్ ఫ్లైఓవర్లకు అనుగుణంగా కూడా మెట్రో రైలు పరుగులు తీయనున్నది. దీనికి తోడు శంషాబాద్ ఎయిర్పోర్టుపై భారం తగ్గించేందుకు నగరంలో రెండో విమానాశ్రయ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్రం నుంచి అనుమతులు రాగానే హకీంపేట నుంచి కూడా విమాన రాకపోకలకు మార్గం సుగమం కానున్నది. అలాగే నగరం నలుమూలల ఏర్పాటు చేస్తున్న టిమ్స్ సూపర్ స్పెషాలిటీ దవాఖానల్లో సగం పడకలకు ఉచితంగా, సగం పడకలకు నామమాత్రపు ఖర్చుతోనే మెరుగైన వైద్య సేవలు (హైబ్రిడ్ విధానం) అందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక… ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆర్టీసీ ఉద్యోగుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
ప్రజా రవాణా వ్యవస్థలో మరో విప్లవాత్మక నిర్ణయానికి నాంది పలికింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ప్రజలకు అత్యంత అద్భుతమైన ప్రజా రవాణాను కల్పించే లక్ష్యంలో భాగంగా కీలకమైన నిర్ణయం తీసుకున్నది. మెట్రో సర్వీసులను 415 కిలోమీటర్ల మేర విస్తరించి ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఫలితంగా దేశ రాజధాని ఢిల్లీ తర్వాత అతి పెద్ద మెట్రో నెట్వర్క్ హైదరాబాద్లో ఏర్పాటు కానున్నది. ఇప్పటికే అందుబాటులో ఉన్న మెట్రో మార్గాల్లో 348 కిలోమీటర్లతో ఢిల్లీ ఉండగా.. తర్వాతి స్థానంలో 69 కి.మీ.తో హైదరాబాద్ ఉన్నది. అయితే కొత్తగా ప్రతిపాదించిన మెట్రో మార్గాలతో దేశ రాజధానితో హైదరాబాద్ పోటీపడనుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ప్రస్తుతం 46 కి.మీ. మేర మెట్రో మార్గంలో రాకపోకలు సాగుతుండగా, మరో 145 కి.మీ. నిర్మాణంలో ఉన్నది. హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ నగరాల సరసన నిలపాలన్న లక్ష్యంతో ఉన్న సీఎం కేసీఆర్.. కొత్త మెట్రో మార్గాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే ప్రపంచంలోని టాప్ 20 నగరాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన హైదరాబాద్లో ప్రతిపాదిన మెట్రో మార్గం అందుబాటులోకి వస్తే.. అంతర్జాతీయ నగరాల్లో ప్రత్యేక గుర్తింపు లభించనున్నది.
మెట్రో కొత్త మార్గాలు ఇవే..
ఐటీలో మేటి.. మరోవైపు ఫార్మా సిటీ
ఔటర్ రింగు రోడ్డు గ్రోత్ కారిడార్లో అభివృద్ధి జోరందుకుంది. మాదాపూర్లో మొదలైన ఐటీ కారిడార్ అభివృద్ధి ఇప్పుడు గచ్చిబౌలి, నానక్రాంగూడ, కోకాపేట, నార్సింగి, పుప్పాల్గూడ ప్రాంతాల్లో విస్తరించింది. మరో ఐదేళ్లలో ఓఆర్ఆర్ గ్రోత్ కారిడార్ పరిధి అత్యాధునిక ఐటీ కార్యకలాపాల భవనాలకు, నివాస భవనాలకు కేంద్రంగా మారనున్నది. మరోవైపు బయో ఫార్మ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో హైదరాబాద్ తనదైన సత్తా చాటుతున్నది. ఇటీవల ఎఫ్డీఐ బెంచ్మార్క్ నివేదిక ప్రకారం ఆర్అండ్డీ ల్యాబ్ కార్యకలాపాలు నిర్వహించాలంటే హైదరాబాద్లోనే అతి తక్కువ ఖర్చు అవుతుందని వెల్లడైంది. ఇతర మెట్రో నగరాలైన ఢిల్లీ, చెన్నై, బెంగళూరుల కంటే మన నగరం అత్యంత అనుకూలమైన ప్రాంతంగా నిలిచిందని ప్రకటించింది. బల్క్ డ్రగ్, ఫార్మా ఎగుమతులతో పాటు ఆర్అండ్డీ ద్వారా హైదరాబాద్ కేంద్రంగా ఉన్న కంపెనీలకు మంచి ఆదాయం సమకూరుతున్నది. ఈ విషయాలను అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం నగర శివారులో కొత్తగా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఫార్మా సిటీతో మెట్రో మార్గాన్ని అనుసంధానం చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వం ప్రతిపాదించిన మెట్రో మార్గం పూర్తయితే నగరం చుట్టూ పట్టణీకరణ పెరిగి మహానగర పరిధి మరింత విస్తృతమవుతుంది.
శరవేగంగా పట్టణీకరణ…
హైదరాబాద్ మహానగరం నలుమూలలా రోజురోజుకు విస్తరిస్తున్నది. ముఖ్యంగా ఐటీ రంగంలో ఊహించని రీతిలో వృద్ధిని సాధించింది. దేశ సిలికాన్ వ్యాలీగా, ఐటీ క్యాపిటల్గా ఉన్న బెంగళూరును సైతం కొన్ని అంశాల్లో వెనక్కి నెట్టుతూ దూసుకుపోతున్నది. దేశంలో ఉన్న 7 ప్రధాన మెట్రో నగరాల్లో హైదరాబాద్ ఒకటి అయినప్పటికీ, వివిధ రంగాల్లో ఇతర సిటీల కన్నా ఎంతో ముందంజలో ఉన్నది. ఈ నేపథ్యంలోనే భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) సమగ్ర రవాణా వ్యవస్థకు ప్రణాళిక రూపొందించింది. దాని ప్రకారం ప్రస్తుతం ఓఆర్ఆర్ వరకు విస్తరించిన నగరం హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న మరో 50 కి.మీ. వరకు విస్తరించే అవకాశమున్నది. దీంతో మహానగర భవిష్యత్ ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా సమగ్ర రవాణా వ్యవస్థ (సీటీఎస్)పై ప్రైవేటు సంస్థలతో అధ్యయనం రూపొందించి నివేదికను రూపొందించారు. ఆ మేరకు మొదటి దశలో 69 కి.మీ. మార్గానికే పరిమితమైన మెట్రో రైలును వివిధ దశల్లో మొత్తం 415 కి.మీ మేర విస్తరించేలా ప్రభుత్వం కేబినెట్లో కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం ఉన్న మెట్రో రైలు – 69 కి.మీ.
ఎయిర్పోర్టు మెట్రో పూర్తయితే -105 కి.మీ.
తాజా ప్రతిపాదనలతో – 415 కి.మీ.
అంచనా విలువ రూ.69,100 కోట్లు