రవీంద్రభారతి, మార్చి 3: బహుముఖ ప్రజ్ఞాశాలి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఈ తరం రాజకీయ నాయకులకు స్ఫూర్తిదాయకమని, పీవీకి అత్యున్నత భారతరత్న అవార్డు ఇవ్వడం దేశానికే గర్వకారణమని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారత రత్న అవార్డు వచ్చిన సందర్భంగా తెలంగాణ బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్రభారతిలో పురస్కార సభ నిర్వహించారు.
తెలంగాణ బ్రాహ్మణ సంఘాల జేఏసీ కన్వీనర్ జమాలాపురం శ్రీనివాస్ సభా అధ్యక్షత వహించగా.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం.. పీవీ నరసింహారావు చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పీవీ కూతురు శారదమ్మను మంత్రి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీధర్బాబు మాట్లాడుతూ.. పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వడం చాలా సంతోషంగా ఉన్నదని అన్నారు. దేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాడని, విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు గురుకులాలను స్థాపించారని గుర్తు చేశారు. పీవీ గొప్ప మేధావని, శ్రీపాదరావు పీవీ నరసింహారావుకు శిష్యుడిగా పేరుగాంచారన్నారు.
బ్రాహ్మణుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలను బ్రాహ్మణులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్, పీవీ ప్రభాకర్రావు, తెలంగాణ బ్రాహ్మణ సంఘాల జేఏసీ కన్వీనర్ జమాలాపురం శ్రీనివాస్, చకిలం అనిల్, రజినీరావు, డా.యజ్ఞం పవన్కుమార్శర్మ, గూడ రాజేశ్వరరావు, లత తదితరులు పాల్గొన్నారు.