సీఎం కేసీఆర్ పాలనలో అసామాన్య విజయాలు
రాష్ట్ర అవతరణ దినోత్సవంలో మంత్రి చామకూర మల్లారెడ్డి
మేడ్చల్, జూన్2 (నమస్తే తెలంగాణ) : ఎనిమిదేండ్లలో రాష్ట్రం అసామాన్య విజయాలు సాధించిందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో గురువారం జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకలలో మంత్రి మల్లారెడ్డి పాల్గొని పతాకావిష్కారణ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రగతిపథంలో అగ్రగామిగా ముందుకు వెళ్తుతుందని అన్నారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుదన్న ఉద్దేశ్యంతో వ్యవసాయాభివృద్ధి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పారు. కొత్త ప్రాజెక్ట్ల నిర్మాణాలు, రైతుబంధు, 24 గంటల విద్యుత్తో పాటు రైతులకు విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచుతుందన్నారు.
అన్ని రంగాల్లో జిల్లా అభివృద్ధి
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. జిల్లాలోని అల్వాల్లో టిమ్స్ ఆసుపత్రిని రూ. వెయ్యి కోట్లతో చేపట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారని చెప్పారు. జిల్లా వైద్య విధాన పరిషత్ పరిధిలోని శామీర్పేట్, మేడ్చల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఉన్నత స్థాయి దవాఖానలుగా మార్చినట్లు తెలిపారు. జిల్లాకు ఆరు పడకల డయాలిసిస్ సెంటర్ మంజూరు చేశామన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ శరత్చంద్రారెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి, జాన్ శ్యామ్సన్, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, సైబరాబాద్ పోలీస్ జాయింట్ కమిషనర్ ఆవినాశ్ మహంతి, డీసీపీ రక్షితామూర్తి జడ్పీ వైస్ ఛైర్మన్ వెంకటేశ్ వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.