ఖైరతాబాద్ : రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులను తయారు చేస్తూ వారిని అన్ని రకాలుగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, స్పోర్ట్స్ హబ్గా తెలంగాణ అవతరించిందని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో క్రీడాకారులకు కొదువ లేదని అన్నారు. ప్రస్తుతం సూర్యపేటలో జాతీయస్థాయి కబడ్డీ పోటీలు జరుగుతున్నాయని, అవి ముగియగానే సైక్లింగ్ పోటీలు, ఆ తర్వాత హ్యాండ్ బాల్ పోటీలు ఇలా వివిధ రకాల క్రీడా పోటీలకు రాష్ట్రం వేదికగా నిలుస్తుందన్నారు. దేశంలో పటియాల తర్వాత అత్యుత్తమ ప్రమాణాలతో వెలోడ్రోమ్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉందని, త్వరలో నిర్వహించే సైక్లింగ్ పోటీలకు హాజరయ్యే క్రీడాకారులకు అన్ని రకాలుగా వసతులు కల్పిస్తామన్నారు.
ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 27 నుంచి 31 తేదీ వరకు ఓయూలోని వెలోడ్రోమ్లో తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్, సాట్స్ సంయుక్త ఆధ్వర్యంలో 72వ జాతీయ స్థాయి ట్రాక్ సైక్లింగ్ చాంపియన్షిప్ 2021 నిర్వహిస్తున్నామని తెలిపారు. పోటీలను రాష్ట్ర మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి ప్రారంభిస్తారన్నారు. ఈ సమావేశంలో సాట్స్ డిప్యూటీ డైరెక్టర్ చంద్రా రెడ్డి, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లారెడ్డి, ఉపాధ్యక్షుడు మర్రి లక్ష్మారెడ్డి, కార్యదర్శి దత్తాత్రేయ, కోశాధికారి విజయ్ కాంత్ పాల్గొన్నారు.