ఉస్మానియా యూనివర్సిటీ, అక్టోబర్ 26: ఉస్మానియా యూనివర్సిటీ 83వ స్నాతకోత్సవాన్ని ఈ నెల 31 (మంగళవారం) న నిర్వహించనున్నట్లు ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ తెలిపారు. ఠాగూర్ ఆడిటోరియంలో మధ్యాహ్నం రెండు గంటలకు ఈ వేడుక ప్రారంభమవుతుందని చెప్పారు. అడోబ్ సీఈవో శంతను నారాయణ్కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఓయూ గెస్ట్హౌజ్లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, పరీక్షల విభాగం, కంట్రోలర్ ప్రొఫెసర్ రాములుతో కలిసి వీసీ మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేడుకకు రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అధ్యక్షత వహిస్తారని, ముఖ్య అతిథిగా శంతను నారాయణ్ హాజరై స్నాతకోత్సవ ఉపన్యాసాన్ని వెలువరిస్తారని తెలిపారు. ఓయూ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న 49వ వ్యక్తిగా శంతను నారాయణ్ నిలుస్తారని చెప్పారు. ఇప్పటి వరకు లా విభాగంలో 30, సాహిత్యంలో 12, సైన్స్లో 6 గౌరవ డాక్టరేట్లను ఓయూ ప్రదానం చేసిందని గుర్తు చేశారు.
వారిలో 18 మంది ప్రముఖ వ్యక్తులు, ఎనిమిది మంది రాజ కుటుంబీకులు, ఆరుగురు విదేశీ ప్రముఖులు, నలుగురు జాతీయ నాయకులు, ఐదుగురు న్యాయమూర్తులు, ముగ్గురు రాష్ట్రపతులు, ఇద్దరు ప్రధానమంత్రులు, ఇద్దరు కవులు ఉన్నారని వివరించారు. జూలై 2021 నుంచి జూలై 2022 వరకు వివిధ కోర్సులు పాసైన వారికి బంగారు పతకాలు ప్రదానం చేస్తామన్నారు. 2022 ఆగస్టు 6వ తేదీ నుంచి 2023 అక్టోబర్ 10వ తేదీ వరకు పరీక్షలు పాసైన వారికి పీహెచ్డీ పట్టాలు ప్రదానం చేస్తామన్నారు.
మొత్తం 57 బంగారు పతకాలను 45 మంది విద్యార్థులు గెలుచుకున్నారని, వారిలో ఆరుగురు అబ్బాయిలు కాగా, 39 మంది అమ్మాయిలు కావడం విశేషమన్నారు. 979 మంది పీహెచ్డీ పట్టాలు పొందేందుకు దరఖాస్తు చేసుకున్నారని, వారిలో 608 మంది పురుషులు కాగా, 371 మంది మహిళలని పేర్కొన్నారు. అత్యధికంగా 272 మంది ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ నుంచి, 189 మంది ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్ నుంచి పీహెచ్డీ పట్టాలు అందుకోనున్నారన్నారు. పట్టాలు అందుకునేందుకు దరఖాస్తు చేసుకోని వారు ఎగ్జామినేషన్ బ్రాంచి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
తమ పేర్లు నమోదు చేసుకున్నవారు కంట్రోలర్ కార్యాలయం నుంచి ఎంట్రీ పాస్, ఐడీ కార్డులను పొందాలని సూచించారు. బంగారు పతకాలు స్వీకరించనున్న వారి వెంట ఒకరిని మాత్రమే అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు. పీహెచ్డీ పట్టాలు స్వీకరించబోయే వారి వెంట ఎవరినీ అనుమతించబోమని స్పష్టం చేశారు. మీడియా ప్రతినిధులకు పీఆర్వో కార్యాలయం నుంచి పొందిన పాస్ ద్వారా మాత్రమే ప్రవేశముంటుందని వివరించారు. కార్యక్రమంలో ఓఎస్డీ ప్రొఫెసర్ రెడ్యా నాయక్, పీఆర్వో ప్రొఫెసర్ ప్యాట్రిక్, యూజీసీ డీన్ ప్రొఫెసర్ మల్లేశం, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్, వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్, అధికారులు పాల్గొన్నారు.