హిమాయత్నగర్,ఏప్రిల్27: శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధికి నూతన విద్యా విధానం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబ్రాది అన్నారు. బుధవారం నారాయణగూడలోని బీజేఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో నూతన విద్యా విధానం అనే అంశంపై జాతీయ సదస్సు జరిగింది.
ప్రిన్సిపాల్ డాక్టర్ పి.వి గీతాలక్ష్మి పట్నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు లింబ్రాది ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం దోస్త్ విధానంను ప్రవేశ పెట్టడం వల్ల సెల్ఫోన్ సహాయంతో రాష్ట్రంలోని విద్యార్థులు ఎక్కడినుంచైనా ఉన్నత విద్యలో చేరే అవకాశం దేశంలోనే మన రాష్ట్రంలోనే అమలవుతోందన్నారు.
నాలుగు లక్షలకు పైగా విద్యార్థులు ఈ విధానంతో లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. ప్రత్యేక అతిథిగా హాజరైన ప్రొఫెసర్ ఇ.రేవతి మాట్లాడుతూ.. నూతన విద్యా విధానంలో నాణ్యమైన విద్య, మౌలిక సదుపాయలను కల్పించి, అనేక సంవత్సరాల నుంచి ఈ దేశం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలకు పరిష్కారం చూపేందుకు వీలుగా నూతన విద్యా విధానాన్ని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో ప్రతినిధి డాక్టర్ షేక్ కమ్రుద్ధీన్, వైస్ ప్రిన్సిపాల్ ఎస్.రాధిక, అధ్యాపకులు డాక్టర్ వేదాంతం మల్లిక,గీతాశ్రీ, మునిస్వామి,రాజ్కుమార్ పాల్గొన్నారు.