సిటీబ్యూరో, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ) : ‘మీసేవ’లో కొత్తగా తీసుకొచ్చిన సాఫ్ట్వేర్ను అప్లోడ్ చేయడంలో భాగంగా సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవడంతో శనివారం రవాణా శాఖకు సంబంధించి పలు సేవలు నిలిచిపోయాయి. స్లాట్స్ బుకింగ్, ట్రాన్సక్షన్స్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఇటీవల మీసేవకు సంబంధించిన పలు సేవల ధరలు పెరగడంతో పోర్టల్ను అత్యాధునీకరిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం సేవలు పూర్తిగా నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
అప్పటికే స్లాట్స్ బుకింగ్ చేసుకున్న వారు సైతం ‘మీసేవ’లో పేమెంట్స్ చేయాల్సి ఉండటంతో సేవలకు బ్రేకులు పడ్డాయి. దీంతో పలు ఆర్టీఏ కార్యాలయాలు వెలవెలబోయాయి. అంతేకాదు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆదాయ ధ్రువీకరణపత్రం వంటి ముఖ్యమైన సేవల కోసం వచ్చిన ప్రజలు సర్వర్ పనిచేయకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు తమకు అవసరమైన ధ్రువీకరణపత్రాలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా, మీసేవ పోర్టల్ ఆదివారం ఉదయం నుంచి కార్యకలాపాలు కొనసాగుతాయని సిబ్బంది తెలిపారు.