సిటీబ్యూరో/ మేడ్చల్, మార్చి12 (నమస్తే తెలంగాణ) / బండ్లగూడ/ జూబ్లీహిల్స్ : మహబూబ్నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు సోమవారం జరుగనున్నాయి. మూడు జిల్లాల నుంచి 21 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పోలింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ బూత్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించారు. ఉపాధ్యాయుల నివాసానికి సమీపంలోని పోలింగ్ బూత్లలో వారికి ఓటుహక్కు కల్పించారు. పదో తరగతి పరీక్షల నేపథ్యంలో ఉపాధ్యాయులు విధిగా పాఠశాలకు హాజరు కావాల్సిందేనని అధికారులు తెలిపారు.
మద్యాహ్నం వరకు విధులకు హాజరై స్పెషల్ క్యాజువల్ లీవ్తో ఓటు వేయడానికి వెళ్లే వెసులుబాటును కల్పించారు. హైదరాబాద్ జిల్లాలో 25 బూత్లతో పాటు మొత్తం 139 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయగా, రంగారెడ్డి జిల్లాలో 31 పోలింగ్ స్టేషన్లు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 14 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఇదిలా ఉంటే ఎన్నికల ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్, మైక్రో అబ్జర్వర్లు, ఓపీవో ఎన్నికల సిబ్బందికి అవసరమైన బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలతో సిరా వంటి ఇతరత్రా ఎన్నికల సామగ్రిని ఆదివారమే అందజేసి ప్రత్యేక వాహనంలో ఆయా పోలింగ్ కేంద్రాలకు పంపించారు.
పోలింగ్ సామగ్రి పంపిణీని మేడ్చల్ కలెక్టరేట్లో ఆవరణలో కలెక్టర్ అమోయ్ కుమార్ ప్రత్యేక్షంగా పర్యవేక్షించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, ఏవో వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. హైదరాబాద్ జిల్లాకు సంబంధించి ఎన్నికల సామగ్రి పంపిణీని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి ప్రియాంక అలా పరిశీలించారు. రంగారెడ్డి జిల్లా ఎన్నికల సామగ్రిని రాజేంద్రనగర్ మండల పరిధిలోని వెటర్నరీ విశ్వవిద్యాలయం నుంచి తరలించగా, కలెక్టర్ హరీశ్, అడిషనల్ కలెక్టర్ ప్రతీక్జైన్, ఆర్డీవో చంద్రకళ పరిశీలించారు.
పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. సైబరాబాద్ పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నికలకు మొత్తం 20 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయని చెప్పారు. పోలింగ్ కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు విధించామని, ప్రతి కేంద్రం నుంచి 200మీటర్ల దూరం వరకు ర్యాలీలు, ఊరేగింపులు, సభలు, సమావేశాలు నిర్వహించడం నిషేధమన్నారు. 144సెక్షన్ అమలులో ఉన్నందున నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడకూడదని తెలిపారు.