ప్రపంచస్థాయి మౌలిక వసతులను సమకూర్చే యత్నంలో ప్రభుత్వం నగరంలో పెద్ద ఎత్తున చేపడుతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో భూసేకరణ అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ. తెలంగాణ రాక ముందు భూసేకరణకు ఏండ్లకు ఏండ్లు పట్టేది. ఎడతెగని జాప్యం జరిగేది. కాళ్లరిగేలా తిరిగినా నిర్వాసితులకు పరిహారం అందేది కాదు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వినూత్నమైన విధానాన్ని ఆచరణలో పెట్టి ఆ ఇబ్బందులకు తెరదించేలా చేయగలిగారు. డబ్బుల రూపంలో ఇచ్చే నష్టపరిహారాన్ని ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) రూపంలో అందించే ప్రణాళికను 2017 నుంచి అమలు చేస్తున్నారు. దీంతో నగరవ్యాప్తంగా చేపట్టిన ఎస్సార్డీపీ, ఇతర అభివృద్ధి పనులకు అవసరమైన భూసేకరణకు అడ్డంకులు తొలగిపోయి ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తవుతున్నాయి. గత ఐదేండ్లుగా 1788 మంది నిర్వాసితులు దాదాపు 4వేల కోట్ల రూపాయల విలువైన టీడీఆర్లను అందుకున్నారు. ఈ పాలసీని మెచ్చుకుంటూ నీతిఆయోగ్ కూడా ప్రశంసలు కురిపించింది. కాగా ఎవరికైనా ఎప్పుడైనా అమ్ముకునే వెసులుబాటు కలిగిన ఈ టీడీఆర్ వివరాలను http//tdr.ghmc.telangana. gov.in:8080/ ద్వారా తెలుసుకోవచ్చు.
అభివృద్ధికి ఆటంకం లేకుండా!
నిర్వాసితులకు టీడీఆర్లు ఇస్తుండడంతో నగర వ్యాప్తంగా చేపట్టిన ఎస్సార్డీపీ పనులు అడ్డంకులు లేకుండా త్వరితగతిన పూర్తవుతున్నాయి. ఇందులో భాగంగానే కొత్తగూడ వద్ద నిర్మిస్తున్న ఫ్లైఓవర్, అండర్పాస్ దాదాపుగా పూర్తి కావచ్చిన దృశ్యం.
సిటీబ్యూరో, అక్టోబర్ 18(నమస్తే తెలంగాణ): ఫ్లై ఓవర్లు.. ఆర్వోబీ.. ఆర్యూబీలు, రహదారులు, నాలాల విస్తరణ.. లింకు రోడ్లు.. అభివృద్ధి ఏదైనా ఒక్క భూసేకరణకే ఏండ్ల తరబడి సమయం పట్టేది.. ఇదంతా ఉమ్మడి రాష్ట్రంలో.. స్వరాష్ట్రంలో ప్రాజెక్టు రూపకల్పన జరిగిందే తడవుగా మాసాల వ్యవధిలోనే భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేసుకుని అభివృద్ధికి బాటలు వేస్తున్నది. దీనికి ఒకే ఒక్క కారణంగా 2017 సంవత్సరంలో మంత్రి కేటీఆర్ తీసుకొచ్చిన ‘టీడీఆర్’ పాలసీ. గ్రేటర్ హైదరాబాద్లో వివిధ అభివృద్ధి పథకాల కోసం చేపట్టే భూ సేకరణ, ఆస్తుల సేకరణ సందర్భంగా ఇచ్చే నగదు నష్ట పరిహారానికి బదులుగా ప్రవేశపెట్టిన ట్రాన్స్ఫర్ డెవలప్మెంట్ రైట్స్(టీడీఆర్)లో సత్తా చాటుతున్నది. 2017 నుంచి 2022 అక్టోబర్ 17 నాటికి దాదాపు 4వేల కోట్ల విలువైన 1788 టీడీఆర్లను అందజేసింది. దేశంలో ఏ నగరంలో జరుగని విధంగా రికార్డుస్థాయిలో ఈ టీడీఆర్లను జీహెచ్ఎంసీ అందజేసింది. అభివృద్ధి కార్యక్రమాలకు చేసే భూసేకరణలకు నగదు మొత్తం ఇవ్వడానికి బదులుగా టీడీఆర్లు ఇచ్చే విధానం. టీడీఆర్ను బ్యాంకులో ప్రవేశపెట్టిన జీహెచ్ఎంసీని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ప్రణాళిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నీతి అయోగ్ కూడా ప్రశంసించడం గమనార్హం. ఈ టీడీఆర్ విధానాన్ని ఇతర రాష్ర్టాలు కూడా అవలంభించడానికి నీతి అయోగ్ సూచించింది.
గ్రేటర్ హైదరాబాద్లో వివిధ అభివృద్ధి పథకాలకై చేపట్టే భూ సేకరణ, ఆస్తుల సేకరణ సందర్భంగా జీహెచ్ఎంసీ టీడీఆర్ పత్రాలను అందజేస్తున్నారు. అభివృద్ధి పనులకు, ప్రైవేట్ వ్యక్తుల నుంచి భూమిని సేకరించి, నగదు పరిహారానికి ప్రత్యామ్నాయంగా ఈ టీడీఆర్ను ఇస్తున్నారు. ఏదైనా ఒక నిర్వాసితుడు నాలా విస్తరణ వల్ల ఏ మేరకు స్థలాన్ని కోల్పోయాడో, అంతకు నాలుగు రెట్లకు టీడీఆర్ పత్రాలను పరిహారంగా పొందుతాడు. ఉదాహరణకు అమీర్పేటలో 20 గజాల ఇల్లు కోల్పోయిన నిర్వాసితుడు జీహెచ్ఎంసీ ఇచ్చే 80 గజాల టీడీఆర్ పత్రాన్ని తీసుకుని ఇతరులకు విక్రయించుకునే హక్కు పొందుతాడు. టీడీఆర్ పత్రం కలిగిన వారు, జీహెచ్ఎంసీ బహుళ అంతస్తుల భవనాల నిర్మాణానికి ఇచ్చే అనుమతికి అదనంగా చేపట్టే నిర్మాణ వైశాల్యాన్ని నిబంధనలను అనుసరించి క్రమబద్ధీకరించుకోవచ్చు. ఫలితంగా లక్ష రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితుల్లో.. టీడీఆర్ ద్వారా అంతకు రెట్టింపు లేదా, తనకు నచ్చిన మొత్తానికి విక్రయించుకుని లాభపడుతున్నారు.
ఆన్లైన్లో టీడీఆర్ బ్యాంకు వివరాలు
అపార్ట్మెంట్, భవనాల బెటర్మెంట్, ప్లానింగ్ తదితర ఫీజులు మాఫీ చేస్తారు. దీనిని సొంతానికైనా వాడుకోవచ్చు.. లేదా బిల్డర్లకు అమ్మకం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. రోడ్లు, నాలాల విస్తరణతో స్థలాలు కోల్పోతున్న బాధితులకు రిజిస్ట్రేషన్ శాఖ భూమి విలువ ప్రకారం అంచనాలు తయారు చేస్తారు. ఎంత నష్టమవుతుందో నిర్ధారణ చేసి టీడీఆర్ ఇస్తారు. బాధితుడికి కొంత వరకు లాభం చేకూరుతుంది. టీడీఆర్ బ్యాంకు వివరాలు https://tdr.ghmc.telangana.gov.in:8080/ ద్వారా తెలుసుకోవచ్చు. క్రయ, విక్రయాల వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నట్లు అధికారులు తెలిపారు.